అతడు ఓ దొంగ.మామ్మూలు దొంగ కాదండోయ్.
పెద్ద కిలాడీ దొంగ.ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 5000 కార్లు దొంగిలించి తన ముగ్గురు భార్యలతో ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ఏమనాలి? అయితే పాపం పండక తప్పదు కదా.తాజాగా అతగాడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలవెనక్కి నెట్టారు. ‘అనిల్ చౌహాన్’ అనే వ్యక్తి గత 27 ఏళ్లలో 5000కు పైగా కార్లను దొంగిలించాడు.
అలా వచ్చిన డబ్బుతో ఢిల్లీ, ముంబై, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాపర్టీస్ కొని విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు.పలు రాష్ట్రాల్లో కార్లు చోరీ చేస్తూ వాటిని విక్రయించి సొమ్ము చేసుకున్నాడని ఢిల్లీ పోలీసులు ఈ గజ దొంగ కేసు వివరాలు వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే, 52 ఏళ్ల అనిల్ చౌహాన్ ఆటో నడుపుతూ బతికేవాడు.ఆ జీవితం బోర్ కొట్టి, తక్కువ సమయంలోనే ఎలాగైనా ఎక్కువ డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసుకున్నాడు.
ఈ క్రమంలో 27 ఏళ్ల కిందట అతని దొంగతనానికి పునాది పడింది.ఈ క్రమంలో 5000కు పైగా కార్లును మరికొందరి సాయంతో చోరీ చేశాడు.
పలు కేసులు విచారణ చేపట్టిన ఢిల్లీ సెంట్రల్ పోలీసులు ఇతనిపై నిఘా ఉంచారు.ఢిల్లీలోని దేశ్ బంధు గుప్తారోడ్డులోని నివాసంలో ఉండగా అక్కడికి వెళ్లిన పోలీస్ టీమ్ అనిల్ చౌహాన్ను అరెస్ట్ చేసింది.
దేశంలోనే పెద్ద కార్ల దొంగను అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు.

ఇలా పలు రాష్ట్రాల్లో కార్లు చోరీ చేసి వాటిని జమ్మూకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా పంపించేవాడు.తన చోరీలలో భాగంగా కొందరు క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లను సైతం అనిల్ చౌహాన్ హత్య చేసినట్టు ఆరోపణలు వున్నాయి.అతడిపై ఇప్పటివరకూ 180 కేసులు నమోదయ్యాయి.
అందులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నమోదుచేసిన మనీ లాండరింగ్ కేసు కూడా ఉంది.ఇకపోతే నిందితుడుకి ముగ్గురు భార్యలు ఉన్నారు.
వారి నుంచి అతడికి ఏడుగురు సంతానం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.అసోం వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు.
కార్లు అమ్మగా వచ్చిన సొమ్ముతో ఢిల్లీ, ముంబై, ఈశాన్య రాష్ట్రాల్లో ఆస్తులు కూడబెట్టాడు.అనారోగ్య సమస్యలతో ఢిల్లీకి తిరిగొచ్చిన అనిల్ చౌహాన్ను ఢిల్లీ సెంట్రల్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేయడం కొసమెరుపు.







