తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి తెలంగాణతో పాటు ,ఢిల్లీ రాజకీయాలను వేడెక్కించే పనిలో పడ్డారు.తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది కెసిఆర్ లో టెన్షన్ పెరుగుతోంది.
క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా చేయడంతో పాటు, తాను జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా పర్యటనలు చేస్తున్నారు.అలాగే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరిన్ని బాధ్యతలు అప్పగించి మూడోసారి పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇక కేసిఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.దీనిలో భాగంగానే కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు ఢిల్లీ కేంద్రంగా మకాం వేసి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలతో కేసిఆర్ ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరుపుతున్నారు.కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాకుండా చూడడమే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు.
ఈ మేరకు ఈరోజు సాయంత్రం కెసిఆర్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు.ఆయన వెంట పార్టీ కీలక నాయకులు, కొంతమంది మంత్రులు, మరికొంతమంది ఎంపీలు వెళ్తుండడంతో కేసీఆర్ పెద్ద ప్లాన్ తోనే ఢిల్లీ టూర్ పెట్టుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో అనుమానాలు మొదలయ్యాయి.

ఇప్పటికే అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చిన కేసీఆర్ ఈసారి ఢిల్లీ పర్యటనలో అనేక కీలక అంశాలపై క్లారిటీ తెచ్చుకునే పనిలో ఉన్నారు.ఇప్పటికే తెలంగాణ గవర్నర్ సౌందర్యరాజన్ ఢిల్లీలో మకాం వేశారు.ఈరోజు రాష్ట్రపతి గా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రులను గవర్నర్ కలుస్తుండడం తదితర పరిణామాలతో కేసిఆర్ కూడా ఇప్పుడు ఢిల్లీ కి వెళ్తుండడం రాజకీయంగా ప్రాధాన్యం సంచరించుకుంది.







