కోవిడ్ ను నియంత్రించే వ్యాక్సిన్ పొందడానికి అర్హత ఉండి కూడా దేశంలోని దాదాపు 4 కోట్ల మంది కనీసం ఒక్కడోసు కూడా తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.దేశంలో వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న తీరుపై లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీప్రవీణ్ పవార్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు…
కరోనా వైరస్ను ఎదుర్కొనే వ్యాక్సిన్ పంపిణీ దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటివరకు దేశంలో 200 కోట్ల డోసులకుపైగా వ్యాక్సిన్ పంపిణీ అయింది.అందులో ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా 178 కోట్ల 38 లక్షల 52 వేల 566 డోసులను అంటే 97.34శాతం ఉచితంగా పంపిణీ చేశారు.ఈ నెల 18 వరకు 4 కోట్ల మంది ఒక్కడోసు కూడా తీసుకోలేదని మంత్రి తెలిపారు.వృద్ధుల్లో 98 శాతం కనీసం సింగిల్ డోసు తీసుకోగా, 90 శాతం అన్ని డోసులూ తీసుకున్నారని మంత్రి తెలిపారు…

దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లతోపాటు 60ఏళ్ల వయసుపైబడిన వారికి ప్రికాషన్ డోసు పంపిణీని ఈ ఏడాది మార్చిలోనే ప్రారంభించామని కేంద్రమంత్రి గుర్తు చేశారు.ఈ క్రమంలో 18 నుంచి 59ఏళ్ల వారికి కూడా జులై 15 నుంచి ఉచితంగానే పంపిణీ మొదలు పెట్టామన్నారు.ఆజాదీకా అమృత మహోత్సవ్లో భాగంగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని 75 రోజులపాటు కొనసాగించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.
కరోనా నుంచి కోలుకున్న వారిలో దాదాపు 10 నుంచి 20శాతం మందిలో దీర్ఘకాలంపాటు వ్యాధి లక్షణాలు వేధిస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.
బాధితులు దీర్ఘకాలిక కోవిడ్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ నివేదికల్లోనూ ఉన్నదని మంత్రి తెలిపారు.అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్ఞాపకశక్తి కోల్పోవడం, నిద్రలేమి, దగ్గు, ఛాతి నొప్పి, నరాల నొప్పులు, వాసన ,రుచి కోల్పోవడం, ఆందోళన, జ్వరం వంటి సమస్యలను వారు ఎదుర్కొంటున్నారు.
ఇందుకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలను ఇదివరకే విడుదల చేశామని మంత్రి వివరించారు…







