పశ్చిమబెంగాల్ మంత్రి పార్థాఛటర్జీని ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో ఛటర్జీని అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు.
అంతకుముందు కోల్కతాలోని మంత్రి నివాసంలో అధికారులు 23 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు.విచారణకు మంత్రి సహకరించలేదని, దాంతో ఆయన్ను అరెస్టు చేశామని ఈడీ వెల్లడించింది.మంత్రి అనుచరురాలు అర్పితా ముఖర్జీ నివాసంలో శుక్రవారం రూ.20 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకున్నది.ఆమెను కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది.ఈ నేపథ్యంలో వీరిద్దరి అరెస్టులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి…
పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి.
ప్రస్తుతం ఆయన పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు.శుక్రవారం నుంచే ఈడీ అధికారులు ఛటర్జీతోపాటు అర్పితా ముఖర్జీ, విద్యామంత్రి ప్రకాశ్ అధికారి, ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య, మరికొందరి నివాసాలపైనా ఏకకాలంలో దాడులు ప్రారంభించారు.
పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసిన పి.కె.బందోపాధ్యాయ, వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్జీ తదితరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి…
అర్పిత ఇంట్లో రూ.20 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఆ మొత్తం ఉపాధ్యాయ ఉద్యోగ నియామక కుంభకోణానికి సంబంధించిందేనని వారు భావిస్తున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో పేర్కొంది.శనివారం కూడా అర్పిత నివాసంలో సోదాలు జరుగుతున్నాయి.పలు ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు, రూ.50 లక్షల విలువైన బంగారు, వజ్ర ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ పేర్కొన్నది.
ఈడీ దాడుల నేపథ్యంలో బీజేపీ రెండు ఫొటోలు షేర్ చేసింది.ఆ ఫొటోల్లో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మంత్రి ఛటర్జీతో అర్పిత దర్శనమిచ్చారు.ఈ చిత్రాలను పోస్టు చేసిన బీజేపీ నేత సువేందు అధికారి…ఇది ట్రైలర్ మాత్రమే… అసలు సినిమా ముందుందంటూ కామెంట్ చేశారు…
.






