జనసేన పార్టీ ఫామ్ లోకి వచ్చేసింది.ఏపీలో అధికారంలోకి రావాలన్న పట్టుదల ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు, కార్యకర్తల్లోనూ, పవన్ అభిమానులలోను కనిపిస్తోంది.
గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో జనసేన బాగా యాక్టివ్ అయింది.అనేక ప్రజా సమస్యల విషయమై గట్టిగానే పోరాటాలు చేపడుతూ, ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అధికార పార్టీ వైసిపికి ముచ్చెమటలు పట్టించేలా వివిధ సమస్యలను హైలెట్ చేయడంలో జనసేన పార్టీ సక్సెస్ అయింది ముఖ్యంగా ఏపీలో అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిని డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా వెలుగులోకి తెస్తూ, ప్రజా సమస్యలపై తమకు ఏ స్థాయిలో చిత్తశుద్ధి ఉంది అనేది నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది .ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కంటే మెరుగ్గా వైసిపి ప్రభుత్వంపై పోరాటం చేయడంలో జనసేన సక్సెస్ అవుతోంది.
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్నా, అవేమి పట్టించుకోకుండా, సొంతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఇక చేరుకల విషయంలో ఆ పార్టీ వెనుకబడినట్టే కనిపిస్తున్నా, ఎన్నికల సమయం నాటికి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని జనసేన నమ్ముతోంది.
టిడిపి వైసిపిలలో టికెట్లు దక్కని వారు ఆ పార్టీల అధినేతల తీరుతో అసంతృప్తికి గురైన వారు, ఆయా పార్టీల్లో ఇ మడలేక సతమతమవుతున్న వారు జనసేన వైపు చూస్తారని పవన్ నమ్ముతున్నారు.ఇప్పటికే కొంతమంది వైసీపీ, టిడిపిలకు చెందిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు జనసేనతో మంతనాలు చేస్తున్నట్టు గా తెలుస్తోంది.

మొత్తంగా ఏపీలో అధికారంలోకి వచ్చే అంత స్థాయిలో సీట్లను సంపాదించలేకపోయినా , ఏ పార్టీ అధికార బాధ్యతలు చేపట్టాలన్న తప్పనిసరిగా తమ మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఆ విధంగా కింగ్ మేకర్ అవ్వొచ్చు అనే లెక్కల్లో పవన్ ఉన్నారు.ప్రస్తుతం జనసేన బలపడుతున్న తీరు అటు అధికార పార్టీ వైసీపీకి ఆందోళన కలిగిస్తుండగా, టిడిపి ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది.జనసేన రానున్న రోజుల్లో మరింతగా బలపడితే తమ రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించిన చర్చల్లో జనసేన ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉంటుందనే భయము ఇప్పుడు తెలుగుదేశం లో మొదలైంది.ప్రస్తుతం ఏపీలో జనసేన బలపడుతున్న తీరు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఆనందం కలిగిస్తోందట.







