తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడు అలకులు అసంతృప్తులు సర్వసాధారణమే.ఏదో ఒక విషయంపై సీనియర్ , జూనియర్ నాయకుల మధ్య వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి.
అలాగే తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారంటూ అధిష్టానానికి ఫిర్యాదులు పంపుతూ తమ ప్రాధాన్యం ఏంటో చూపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతూ వస్తున్నాయి.
వీటిని అరికట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న అవేమీ వర్కౌట్ కావడం లేదు.ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు జోరందుకున్నాయి.
టిఆర్ఎస్ లోని అసంతృప్త నాయకులు బిజెపి వైపు వెళ్లకుండా కాంగ్రెస్ లో చేరుతున్నారు.ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వరుస వరుసగా నియోజకవర్గస్థాయి , రాష్ట్రస్థాయి నాయకులు పార్టీలో చేరుతున్నారు.అయితే కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు, జిల్లా ఇన్చార్జీలు మాత్రం తమకు తెలియకుండానే రేవంత్ చేరికలను ప్రోత్సహిస్తున్నారనే అసంతృప్తితో ఉన్నారు.
ఇదే విషయంపై కొద్దిరోజులుగా కాంగ్రెస్ లో రచ్చ జరుగుతుండగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ స్పందించారు.గ్రామాల్లో రైతు రచ్చబండ కార్యక్రమం పై గాంధీభవన్ లో పీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మాట్లాడిన మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ లో చేరికలు, అసంతృప్తుల అంశంపై మాట్లాడారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తమకు కనీస సమాచారం లేకుండానే తమ జిల్లాల్లో నాయకులను చేర్చుకుంటున్నారని , ఇలా అయితే తమ పరిస్థితి ఏమిటంటూ ఠాకూర్ ను ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన ఆయన చేరికలు సందర్భంగా వీలైనంతవరకు జిల్లా అధ్యక్షులకు సమాచారం ఇస్తారని, ఒక్కో సందర్భంలో అది కుదరకపోవచ్చు అని, కొత్త నేతలు చేరిక వల్ల పాత నేతలకు ప్రాధాన్యం తగ్గదని వారికి ప్రత్యేక కోట కింద టిక్కెట్లు కేటాయిస్తామని ఠాగూర్ చెబుతూ బుజ్జగించే ప్రయత్నం చేశారు.ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరికలు చోటు చేసుకున్నాయి.ఈ జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న మల్లు బట్టు విక్రమార్కకు తెలియకుండానే ఆ చేరికలు చోటు చేసుకోవడంపై ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలంతా రేవంత్ రెడ్డి పై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇప్పుడు మాణిక్యం ఠాకూర్ ఈ విధంగా బుజ్జగిస్తూ రేవంత్ నిర్ణయాలకు ఎవరూ స్వీట్ బ్రేకర్లుగా మారవద్దనే సంకేతాలను ఇచ్చారు.