తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల సందడి బాగా పెరిగింది. అధికార పార్టీ టిఆర్ఎస్ కు చెందిన నేతలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతుండడంతో ఆ స్థాయిలో పండుగ వాతావరణం కనిపిస్తుంది.
తెలంగాణలో టిఆర్ఎస్ ,బిజెపి నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్న క్రమంలో కాంగ్రెస్ వలసలపై ఎక్కువగా దృష్టి సారించింది.టిఆర్ఎస్ లో అసంతృప్త నేతలు అంతా బిజెపి వైపు కాకుండా, కాంగ్రెస్ వైపు చూస్తూ ఉండడం ఎవరికి అంతుబట్టడం లేదు.
ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పూర్తిగా చేరిక అంశంపై దృష్టి పెట్టారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పైనా దృష్టి పెట్టి పెద్ద ఎత్తున చేరుకలు ఉండేలా చూసుకుంటున్నారు.
టిఆర్ఎస్ బిజెపిలో ఉన్న అసంతృప్తి నాయకులను చేర్చుకుంటూ తన ప్రభావాన్ని కాంగ్రెస్ అధిష్టానం పెద్దల వద్ద మరింతగా రేవంత్ పెంచుకుంటున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో చేరికల ఉత్సాహం ఎంతగా అయితే ఉందో … అంతే స్థాయిలో అసంతృప్తి నెలకుంది.
ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు అసంతృప్తి కి గురవుతున్నారు.తమకు కనీస సమాచారం ఇవ్వకుండానే పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి చేరికలను ప్రోత్సహిస్తున్నారని వారు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు.
ఆయా జిల్లాల్లో ఉన్న ముఖ్య నేతలకు సమాచారం ఇవ్వకుండా చెరికలను ప్రోత్సహిస్తూ ఉండడం కూడా అసంతృప్తి కి కారణం అవుతుతోంది. రాబోయే ఎన్నికల్లో టికెట్ తమదేననే ధీమా తో ఇప్పటివరకు పార్టీ కోసం కష్టపడిన వారికి సమాచారం ఇవ్వకుండానే టీఆర్ఎస్ కు చెందిన నియోజకవర్గ స్థాయి నాయకులు చేరుతుండడం కాంగ్రెస్ లో టికెట్ ఆశిస్తున్న నేతలకు టెన్షన్ పుట్టిస్తోంది.

ఇప్పటివరకు పార్టీ కోసం తాము ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ అధికార పార్టీ టిఆర్ఎస్ పై పోరాటాలు చేశామని, ఇప్పుడు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కు చెందిన వారిని కాంగ్రెస్ లో చేర్చుకుని టికెట్ కనుక ఇస్తే, తమ పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు సంధిస్తున్నారు.ఇదే విషయమై చాలా చోట్ల కాంగ్రెస్ నేతలు సమావేశమై చేరికలపై అధిష్టానానికి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు.కాంగ్రెస్ లో చేరికలు ఎక్కువగా కనిపిస్తున్నా.దీనిపై గందరగోళం ఎక్కువగా ఉంది.







