విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్.కలెక్టర్ బయటకి రావాలంటూ విద్యార్థుల నినాదాలు.
కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన విద్యార్థులు.విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు,పరిస్థితి ఉద్రిక్తం.
ఎట్టకేలకు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన ఎస్ఎఫ్ఐ నేతలు.
యాదాద్రి జిల్లా:విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో సోమవారం భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.ఈ నేపథ్యంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.అనంతరం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని,ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో బ్రిడ్జి కోర్స్ పేరుతో కాలయాపన చేయరాదని, పాఠ్యపుస్తకాలను తక్షణమే అందివ్వాలని,ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం పేద విద్యార్థులకు చదువును దూరం చేసే కుట్ర చేస్తుందని,సర్కార్ బడులను అభివృద్ధి చేసి బడుగు బలహీన వర్గాల పిల్లలకు మెరుగైన విద్యా బోధన అందించాలని కోరారు.ప్రభుత్వం విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షకార్యదర్శులు,డివిజన్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.







