ఏపీ సీఎం జగన్ ప్రాధాన్యం ఏంటి అనేది బిజెపి నాయకులకు ఇప్పుడు అర్థం అయినట్లు కనిపిస్తోంది.ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ ఏపీ బిజెపి నాయకులు విమర్శలు చేస్తుండగా, కేంద్ర బిజెపి పెద్దలు మాత్రం జగన్ తో సానుకూలంగా ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు.
దీనికి కారణం కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు జగన్ బేషరతుగా మద్దతు ప్రకటిస్తూ ఉండడమే.వైసీపీ ఎంపీలు అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొనడం తదితర కారణాలే.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల హడావుడి నెలకొంది.ఈ ఎన్నికల్లో బిజెపి ప్రతిపాదిస్తున్న అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఆ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తుండగా, బిజెపి కి పోటీగా మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఒప్పించి తాము ప్రతిపాదిస్తున్న అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో బిజెపి రాష్ట్రపతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.బిజెపి ప్రతిపాదిస్తున్న అభ్యర్థి రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే ఖచ్చితంగా వైసీపీ మద్దతు అవసరం.151 ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలు వైసీపీకి ఉండడంతో ఇప్పుడు జగన్ మద్దతు ఇచ్చిన వారే రాష్ట్రపతిగా గెలిచే అవకాశం ఉండడంతో జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ అగ్రనేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.జులై 18న రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ జరగనుంది.
ఈ క్రమంలోనే జూలై 4వ తేదీన నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు.విశాఖ , నరసాపురం జిల్లాలో ఆయన పర్యటిస్తారు.

ఈ సమయంలోనే జగన్ తో ప్రధాని ప్రత్యేకంగా సమావేశం అవుతారని, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ నిర్ణయించిన అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని జగన్ ను ప్రధాని కోరుతారని, జగన్ తో ఇదే అంశంపై చర్చించేందుకు అమిత్ షా కూడా సిద్ధమవుతున్నారట.అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ద్వారా తాము రాష్ట్రపతి అభ్యర్థికి అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొనాలని జగన్ ను కోరేందుకు ప్రత్యేక సమావేశం అవుతున్నట్లు సమాచారం.







