ఏపీ ప్రభుత్వం వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం అవుతోంది.ఈనెల 20 నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సమావేశాల్లో కొత్త డిప్యూటీ స్పీకర్ ఎంపికకు వైసీపీ అధిష్టానం కసరత్తులు షురూ చేసింది.రెండు నెలల క్రితం కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగిన సమయంలో విజయనగరం జిల్లా నుంచి పదవి ఆశించి భంగపడిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామని వైసీపీ అధిష్టానం బుజ్జగింపులు చేసింది.
దీంతో కోలగట్ల వీరభద్రస్వామి కూల్ అయ్యారు.తన పని తాను చేసుకుపోతున్నారు.ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ పదవిని హామీ ఇచ్చినట్లుగానే వైసీపీ అధిష్టానం కోలగట్ల వీరభద్రస్వామికి అప్పగించాలని భావిస్తోంది.ఈ ప్రక్రియ జరగడానికి ముందు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న కోన రఘుపతి నుంచి రాజీనామా తీసుకుంటారు.

అయితే డిప్యూటీ స్పీకర్ పదవి విషయంలో కోలగట్ల సంతృప్తిగా ఉన్నారా అంటే ఆలోచించాల్సిందే అని విజయనగరం జిల్లా వైసీపీ నేతలే కామెంట్ చేస్తున్నారు.ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటే రాజకీయంగా కొన్ని ఇబ్బందులు వస్తాయని.ప్రజలలో సులువుగా కలిసిపోయే వీలు ఉండదని ఆయన అనుచరులు భావిస్తున్నారు.దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలంటే తిప్పలు తప్పవంటూ అభిప్రాయపడుతున్నారు.

డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు నిర్వహిస్తే దూకుడుగా రాజకీయం చేయాలంటే కుదరదు.గతంలో మాదిరిగా ప్రత్యర్ధుల మీద వెల్లువలా విమర్శల బాణాలు వేయాలన్నా ఏ కోశానా కుదిరే వ్యవహారం ఉండదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.అయితే ఇప్పటికే స్పీకర్ పదవిలో ఉంటూ తమ్మినేని సీతారాం ఫక్తు రాజకీయ నేతగా వ్యవహరిస్తున్న దరిమిలా డిప్యూటీ స్పీకర్ కూడా ఆయన దారిలో నడుచుకునే అవకాశాలున్నాయని పలువురు వ్యాఖ్యానించుకోవడం గమనార్హం.మొత్తానికి మంత్రి పదవి ఇవ్వాల్సిన చోట డిప్యూటీ స్పీకర్తో వైసీపీ అధిష్టానం సరిపెట్టడం పట్ల కోలగట్ల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.







