దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి.ముఖ్యంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత లీటర్ పెట్రోల్ ధర రూ.12 మేర పెరిగింది.పెట్రోల్ ధరల ప్రభావం నిత్యావసర ధరలపై పడింది.
దీంతో కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది.ఈ నేపథ్యంలో మోదీ సర్కారు దిగి వచ్చి ఎక్సైజ్ సుంకం తగ్గించింది.దీంతో పెట్రోల్ ధర లీటరుకు రూ.9 తగ్గింది.అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుంకాలు తగ్గించాలని కేంద్రం సూచించింది.
రాజకీయాల్లో ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుంటున్న బీజేపీ నేతలు పశ్చిమ బెంగాల్లో పెట్రోల్, డీజిల్ ధరల అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అక్కడ బీజేపీ వ్యతిరేక సర్కారు ఉండటంతో మమత సర్కారుకు అల్టీమేటం జారీ చేశారు.రాబోయే 15 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులు తగ్గించాలంటూ కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు.
తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఇప్పుడు అదే తరహా రాజకీయాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలపై కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి స్పందన చేయకపోవడంతో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.కేంద్రం తగ్గిస్తే తాము తగ్గించాలని ఎక్కడైనా రూల్ ఉందా అన్న తరహాలో కేసీఆర్ మాట్లాడటంపైనా బీజేపీ నేతలు గరం గరం అవుతున్నారు.
కానీ బెంగాల్ తరహాలో తెలంగాణ బీజేపీ నేతలు స్పందిస్తే కేసీఆర్ సర్కారు ఇరకాటంలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే కేంద్రం పెట్రోల్, డీజిల్పై రెండు సార్లు ట్యాక్సులు తగ్గించడంతో రాష్ట్రాలు కనీసం లీటరు పెట్రోల్ మీద రూ.5, డీజిల్ మీద రూ.10 చొప్పున తగ్గించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.అయితే కరోనాతో తీవ్రంగా ఆర్ధిక నష్టాలను భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్పై వచ్చే ఆదాయాన్ని వదులుకునేందుకు ఇష్టపడటం లేదు.ఇలాంటి పరిస్థితుల్లో మరి బెంగాల్ తరహా రాజకీయాన్ని తెలంగాణ బీజేపీ నేతలు అమలు చేస్తారో లేదో వేచి చూడాలి.







