తెలుగునాట దేవాదాయ భూములన్నీ కబ్జాకోరుల పాలవుతున్నాయి.కొన్ని చోట్ల ప్రభుత్వమే కబ్జా చేసేసి అమ్ముకుంటోంది.
మరికొన్ని చోట్ల అధికార పార్టీ అండతో స్థానిక నేతలు, రియల్టర్లు గుడి భూముల్ని ఆక్రమించుకుని అమ్ముకుంటున్నారు.ఈ దురాక్రమణకు రెవిన్యూ, దేవాదాయ అధికారులు కూడా సహకరిస్తున్నారు.
తెలంగాణలో మొత్తం 70 వేల ఎకరాలకు పైగా దేవాదాయ భూములున్నాయి.శతాబ్దాల క్రితం ఆలయాల ధూప దీప నైవేద్యాల కోసం రాజులు, జమీందారులు వందల ఎకరాలు దానంగా ఇచ్చారు.
అయితే కాలక్రమంలో ఈ భూములు ఆక్రమణలకు గురయ్యాయి.ఏ గుడికి ఎన్ని భూములున్నాయో, ఎక్కడున్నాయో కూడా సరిగా లెక్కలు లేవు.
దేవాదాయ శాఖ నిర్లక్ష్యం గమనించిన కబ్జాకోరులు వీలున్న ప్రతి చోటా భూములు ఆక్రమించుకుని అమ్మేసుకుంటున్నారు.ఈ భూముల్ని సర్వే చేయడానికి దేవాదాయ శాఖకు సర్వేయర్లు లేరు.భూములు ఆక్రమించుకున్న విషయం తెలిస్తే వాటిని కోర్టు ద్వారా స్వాధీనం చేసుకోవడానికి లాయర్లు లేరు.మొత్తంగా దేవాదాయ భూముల్ని ప్రభుత్వం గాలికొదిలేసింది.
ఆలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని గుంజుకునే సర్కార్, వాటి భూముల్ని కాపాడే బాధ్యత మాత్రం తీసుకోవడంలేదు.హైదరాబాద్ నగర పరిసరాల్లోని దేవాదాయ భూముల్ని ప్రభుత్వమే కబ్జా చేసేసి పరిశ్రమలకు ఇచ్చేస్తోంది.
మొత్తంగా దేవుడి మాన్యానికి ఈ ప్రభుత్వాల జమానాలో దిక్కు లేకుండా పోయింది.

దేవాదాయ భూముల్ని రక్షించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది? తెలంగాణలో దేవాదాయ శాఖ అధీనంలో 70 వేల ఎకరాలున్నట్లు సమాచారం.ప్రభుత్వం దగ్గర సరైన లెక్కలున్నాయా?ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతలు దేవుడి భూముల్ని కబ్జా చేస్తుంటే ఇంక రక్షణ కల్పించేది ఎవరు? అధికారంలో ఎవరున్నా దేవుడి భూముల్ని ఆక్రమించుకుంటున్నారు.అక్రమాలు చేయడానికే అధికార పార్టీల్లో చేరుతారా?.కొన్ని చోట్ల రెవిన్యూ రికార్డుల్లో ఆలయానికి భూములుంటాయి.కాని ఆ భూములు ఎవరో ఆక్రమించేసుకుని ఇళ్ళు కట్టుకుని ఉంటారు.








