ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా అప్పుడే ఏపీలో మాత్రం ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.అన్ని రాజకీయ పార్టీల నేతలు రోడ్లపైకి వచ్చి జనాల్లో తమ పలుకుబడి పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంలో హడావుడి చేయడం పరిపాటి అయినా, అధికార పార్టీ వైసిపి సైతం ఇప్పుడు ఎక్కడలేని హడావుడి పడుతోంది.గడపగడపకు ప్రభుత్వం పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులను ప్రజల వద్దకు పంపుతోంది.
అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీ మంత్రులను బస్సు యాత్ర ద్వారా జనాల్లోకి పంపుతూ మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రి చేసే విధంగా ప్రజలు కృషి చేయాలని విజ్ఞప్తులు చేయిస్తోంది.ఈ హడావుడి తతంగమంతా చూస్తుంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా .? అందుకే అధికార పార్టీ వైసీపీ ఇంతగా హడావుడి పడుతోందా అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి.
జగన్ ప్రభుత్వం ఏర్పడి మరో మూడు రోజులకు మూడు ఏళ్ళు అవుతుంది.
ఇంకా సాధారణ ఎన్నికలకు రెండు నెలల సమయం ఉంది.కానీ ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లుగా వైసిపి నాయకులు తమ ప్రసంగాలను వినిపిస్తూ ఉండడం, ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చేసిందనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెబుతుండడం వంటి వ్యవహారాలు ఈ అనుమానాలకు మరింత ఊతం కలిగిస్తున్నాయి.
విశ్వసనీయ వర్గాల ప్రకారం నవంబర్లోనే ఏపీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలనే ప్లాన్ లో ఉన్నారని, దీనికి బీజేపీ కూడా తగిన సహకారం అందించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని, పార్టీ శ్రేణులంతా దానికి సిద్ధంగా ఉండాలి అంటూ పదే పదే ప్రకటనలు చేస్తున్నారు.