తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రచ్చబండ కార్యక్రమం నిన్న ప్రారంభమైంది.రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అంతే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, పెద్దఎత్తున రైతులను సమీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.
దీనికి తగ్గట్లుగానే తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ యాత్రను ఘనంగా ప్రారంభించారు.రాష్ట్రస్థాయిలో 300మంది సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో గ్రామ గ్రామాలకు వెళ్లి ప్రతి గ్రామంలోని రైతులను కలిసి వారితో ముఖాముఖీ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
అయితే షరా మామూలుగానే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు. కొద్ది రోజుల క్రితం వరంగల్ లో రాహుల్ గాంధీ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా వరంగల్ డిక్లరేషన్ ను ప్రకటించారు.ఈ డిక్లరేషన్ ను రూపొందించడంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కీలక పాత్ర పోషించారు.
కానీ తొలి రోజు జరిగిన రైతు రచ్చబండ కార్యక్రమంలో జానారెడ్డి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.నల్గొండ జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలోనూ కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయన వర్గం అంటీ ముట్టనట్లుగానే వ్యవహరించింది.
దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే రకమైన పరిస్థితి కనిపించింది.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ మండలం అక్కంపేట గ్రామంలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి హాజరు కావడంతో… ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భారీగా జనాలు హాజరు అవుతారని అంచనా వేసినా, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు డుమ్మా కొట్టడంతో కాంగ్రెస్ లో పరిస్థితి యధావిధి గానే ఉందని గ్రూపు రాజకీయాలు సైలెంట్ గానే సాగుతున్నాయి అనే విషయం అందరికీ అర్థమైంది. రేవంత్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సీతక్క, కొండా సురేఖ మురళి, జనగామ డిసిసి జంగా రాఘవరెడ్డి తో పాటు మరి కొంత మంది నాయకులు హాజరు కాకపోవడ చర్చనీయాంశంగా మారింది.
ఇక హుజురాబాద్ సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరగలేదు.ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాల పరిధిలో నాయకులు వేర్వేరుగా రచ్చబండ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
అలాగే రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో ఈ రచ్చబండ కార్యక్రమం నిర్వహించలేదు.ముఖ్యమైన నేతలు లేకపోవడంతోనే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ రైతు రచ్చబండ కార్యక్రమం విషయంలో అంతగా ఆసక్తి చూపించుకోవడానికి కారణం గ్రూపు రాజకీయాలేనని కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.వరంగల్ రాహుల్ సభ తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో మార్పు వచ్చినట్టుగా కనిపించినా… అదంతా తాత్కాలికమే అన్నట్టుగా పరిస్థితి తయారైంది.