తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడూ ఏదో ఒక వ్యవహారం తెరపైకి వస్తూనే ఉంటుంది.ముఖ్యంగా సీనియర్, జూనియర్ నాయకులు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉండడం షరా మామూలు వ్యవహారంగా మారిపోయింది.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీనియర్ నాయకులు మధ్య ఏదో ఒక సందర్భంలో వివాదాలు ఏర్పడుతూ ఉండటం, వాటిని అధిష్టానం వద్దకు తీసుకు వెళ్లడం అక్కడ పంచాయతీ నడవడం, ఇవన్నీ నిరంతరంగా కొనసాగే ప్రక్రియ మాదిరి గా మారిపోయాయి.వీటన్నిటినీ చక్కదిద్దేందుకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా తమిళనాడుకు చెందిన మాణిక్యం ఠాగూర్ ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది.
ఈయన పార్టీలో విభేదాలను చక్కదిద్దేందుకు మొదట్లో గట్టిగానే ప్రయత్నాలు చేసినా, సీనియర్ నాయకులు ముందు అవి పని చేయకపోవడం తదితర కారణాలతో సైలెంట్ అయ్యారు.ఇదిలావుంటే ఇటీవల రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చారు.
వరంగల్ లో బహిరంగ సభను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన రాహుల్ కు దూరంగా ఉన్నట్టు గా కనిపించారు.
రాహుల్ గాంధీ విమానాశ్రయంలో దిగిన సందర్భంలో మాణిక్యం ఠాకూర్ ఆయనకు స్వాగతం పలకాల్సి ఉన్నా, ఆయన ఆ సమయంలో వరంగల్ పార్టీ సభా వేదిక వద్ద ఉన్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాహుల్ గాంధీని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ వంటి వారు మాత్రమే స్వాగతం పలికారు.దీంతో మాణిక్యం ఠాకూర్ ఆ పర్యటనలో ఎందుకు దూరంగా ఉన్నట్టుగా కనిపించారు అనే విషయం పైన జోరుగా చర్చ మొదలైంది.ఈ సందర్భంగా తమిళనాడు రాజకీయాలు ప్రస్తావనకు వస్తున్నాయి.
తమిళనాడు పిసిసి అధ్యక్ష పదవి కోసం మాణిక్యం ఠాకూర్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ ప్రయత్నాలను తమిళనాడు కాంగ్రెస్ లోని కీలక నేతలు కొంతమంది అడ్డుకోవడం, ఠాకూర్ కు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం వంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్నాయి.
ఈ విషయాలపై మాణిక్యం ఠాకూర్ పై రాహుల్ గాంధీ సైతం కాస్త అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.అందుకే రాహుల్ తన పర్యటనలో మాణిక్యం ఠాకూర్ ను దూరం పెట్టారు అనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది.







