రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులను యాక్టివ్ చేసి ఎన్నికలకు సిద్ధం చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.మండుటెండను సైతం లెక్కచేయకుండా జిల్లాల యాత్రను ఆయన చేపట్టారు.
ఎన్నికల వరకు విరామం లేకుండా నిత్యం ప్రజల్లో ఉండేలా తగిన ప్రణాళికను బాబు వేసుకున్నారు.కానీ బాబు తాపత్రయాన్ని తెలుగు తమ్ముళ్లు మాత్రం అర్థం చేసుకొనట్టుగానే వ్యవహరిస్తున్నారు.
ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, ఆధిపత్య ధోరణి పెరగడం వంటి కారణాలతో టిడిపి శ్రేణులు గ్రూపులుగా విడిపోయాయి.ముఖ్యంగా కృష్ణాజిల్లాలో సొంత పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించే విధంగా ప్రయత్నించడం, గ్రూపు రాజకీయాలకు పాల్పడటం వంటివన్నీ బాబుకు తీవ్ర అసంతృప్తిని కలుగజేస్తున్నాయి.
ఒక వైపు చూస్తే ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ వైసిపి రకరకాల ప్రయత్నాలు చేస్తూ, ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది.ఈ సమయంలో సమిష్టి నిర్ణయాలు తీసుకుంటూ, పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా తెలుగు తమ్ముళ్లు ప్రయత్నాలు చేయాల్సి ఉన్నా, కృష్ణా జిల్లా నేతలు మాత్రం వర్గ రాజకీయాలు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉండడం బాబుకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది.దీనికితోడు ఇటీవల ప్రకటించిన పార్టీ కమిటీల విషయంలో తమకు ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తి చాలామందికి ఉంది.
ఇటీవల పార్లమెంట్ ప్రాంతాలవారీగా కమిటీలను చంద్రబాబు నియమించారు.ఇందులో మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎంపి కొనకళ్ల నారాయణరావు కు ఉమ్మడి కృష్ణాజిల్లా బాధ్యతలను బాబు అప్పగించారు.
పార్టీ కేంద్ర కమిటీ , పొలిట్ బ్యూరో లోను కృష్ణాజిల్లా నుంచి ఎనిమిది మందికి బాబు అవకాశం కల్పించారు.అయితే వీరంతా సమిష్టిగా పార్టీకోసం కష్టపడకుండా గ్రూప్ రాజకీయాలతో సతమతమవుతున్నారు.
పొలిట్ బ్యూరోలో సభ్యులుగా విజయవాడ నేత బోండా ఉమా, కొల్లు రవీంద్ర ఉన్నారు.జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వర్ల రామయ్య ఉత్తర తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా బుద్ధ వెంకన్న, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు.అలాగే విజయవాడ ఎంపీ కేశినేని నాని గద్దె రామ్మోహన్ రావు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు వంటి సీనియర్ నాయకులు అందరికీ పార్టీ పదవులు దక్కాయి.అయితే వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుండటంతో వివాదాలు ఎక్కువగానే చోటుచేసుకుంటున్నాయి.
బాబు సొంతంగా చేయించిన సర్వేల్లోనూ కష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాల కారణంగా పార్టీ ఇబ్బందులు పడుతోంది అనే విషయం తేలడంతో బాబు సీరియస్ గానే ఈ వ్యవహారంపై దృష్టి పెట్టినట్లు సమాచారం.ఈ మేరకు సదరు నాయకులకు వార్నింగ్ లు వెళ్ళాయట.