సూర్యాపేట జిల్లా:అధికార టీఆర్ఎస్ పార్టీ పోలీస్ యంత్రంగాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకొని బీజేపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తూ వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.శుక్రవారం ఖమ్మంలో అధికార పార్టీ ఆగడాలకు బలైన బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతూ మార్గ మధ్యలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంకినేని నివాసంలో విశ్రాంతి తీసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు మాఫియాగా మారి ప్రజలను వేధిస్తున్నారని మండిపడ్డారు.ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని, టీఆర్ఎస్ పాలనలో ప్రజల హక్కులకు భంగం కలుగుతుందన్నారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక గాలి వీస్తుందని,సర్వేలన్ని వ్యతిరేకంగా మారడంతో కేసీఆర్ అభద్రతాభావంలో ఉన్నాడని ఎద్దేవా చేశారు.అవినీతికి తెలంగాణా సెంటిమెంట్ కి ముడిపెట్టి టీఆర్ఎస్ లబ్ది పొందాలని చూస్తుందన్నారు.
పంజాబ్ రైతు పోరాట మృతులకు పరిహారమిస్తున్న కేసీఆర్ తెలంగాణా ఉద్యమ త్యాగధనులకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.రాష్ట్ర అభివృద్ధి నిధులలో కేంద్ర,రాష్ట్ర వాటాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక పాలనపై రాష్ట్రంలో బీజేపీ ఉద్యమాలు కొనసాగుతాయని తెలిపారు.తెలంగాణా ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం బీజేపీ తోనే సాధ్యమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, జిల్లా,నియోజకవర్గ,పట్టణ నాయకులు పాల్గొన్నారు.