భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో గతేడాది నుంచి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
గడిచిన 75 ఏళ్ల కాలంలో భారతదేశం సాధించిన రాజకీయ, సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక పురోగతిని ఓ ఉత్సవంలా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.దీనిలో భాగంగా 12 మార్చి 2021 నుంచి 2022 ఆగస్టు 15 వరకు మొత్తం 75 వారాల పాటు ‘‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’’ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
భారత్లోని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలతో పాటు వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలోనూ ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో న్యూయార్క్లోని భారత కాన్సులేట్ కార్యాలయంలో స్థానిక సాంస్కృతిక సంస్థల సాయంతో కార్యక్రమాలు జరిపేందుకు శ్రీకారం చుట్టారు.
చిల్డ్రన్ మ్యూజియం సహకారంతో వారం రోజుల వేడుకను నిర్వహించనున్నారు.ఇందులో చరిత్రను గౌరవించే సాంప్రదాయ పెయింటింగ్లు, సంగీతం, కథలు చెప్పడం వంటి కార్యక్రమాలు వున్నాయి.

న్యూయార్క్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ది కల్చర్ ట్రీ, చిల్డ్రన్స్ మ్యూజియం ఆఫ్ మాన్హాటన్లు కలిసి భారత ప్రజల వైవిధ్యాన్ని.నృత్యం, సంగీతం, సాహిత్యం, తోలుబొమ్మలాటల ద్వారా తెలియజేయనున్నారు.ఈ కార్యక్రమాలకు సోమవారం అంకురార్పణ జరిగింది.న్యూయార్క్లోని పిల్లలందరికీ, వారి కుటుంబాలకు భారతదేశంపై అవగాహన కల్పిస్తామని కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్ అన్నారు.ది కల్చర్ ట్రీ వ్యవస్థాపకురాలు అను సెహగల్ మాట్లాడుతూ.ఈ కార్యక్రమాల ద్వారా అమెరికాలోని భారత సంతతి పిల్లలు, వారి కుటుంబాలు భారతీయ వారసత్వంతో కనెక్ట్ అవ్వొచ్చని చెప్పారు.







