కోవిడ్ మహమ్మారిపై పోరాటానికి సంబంధించి స్కాట్లాండ్ ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తున్న భారత సంతతికి చెందిన పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ దేవి శ్రీధర్.లాక్డౌన్ సమయంలో తాను ఎదుర్కొన్న బెదిరింపుల గురించి వివరించారు.
స్కాటిష్ ప్రభుత్వ కరోనా వైరస్ అడ్వైజరీ బోర్డులో వున్న ఎడిన్ బర్గ్ యూనివర్సిటీలోని గ్లోబల్ హెల్త్ ప్రొఫెసర్ దేవిశ్రీధర్ గత వారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.గతేడాది ఆమెకు పోస్ట్ ద్వారా వైట్ పౌడర్, అప్పటికే వాడేసిన ఫేస్ మాస్క్ను పంపినట్లు చెప్పారు.
ఇది చూసి తాను షాక్కు గురైనట్లు దేవి చెప్పారు.వెంటనే ఉద్యోగం నుంచి తప్పుకోవాలని భావించానని.కానీ తన పదవి ప్రజా సేవలో కీలక స్థానాన్ని కలిగి వుందన్నారు.ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలకు వుందని అందువల్ల ఆ ఆలోచన విరమించుకున్నట్లు దేవి అన్నారు.
ఈ వ్యవహారంపై స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టర్జన్ స్పందించారు.దేవి శ్రీధర్ ప్రభుత్వానికి అతి ముఖ్యమైన సలహాదారని ప్రశంసించారు.
అయితే శ్రీధర్కు పోస్ట్లో వచ్చిన వైట్ పౌడర్ బూటకమని తేలింది.కానీ భవిష్యత్తులో ప్రజారోగ్య సంక్షోభాలను పరిష్కరించే శాస్త్రవేత్తల భద్రతపై నిపుణులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

కోవిడ్ 19కి ముందు దేవి శ్రీధర్ .ఆఫ్రికాలో 2014లో ఎబోలా, మెర్స్ వైరస్ల వ్యాప్తిపై ఖచ్చితమైన అంచనాలను రూపొందించిన నిపుణుల్లో ఒకరు.ఆమె తన అభిప్రాయాలను ‘‘ప్రివెంటబుల్’’ అనే పుస్తకంలో వెల్లడించారు.కోవిడ్ సంక్షోభంపై వివిధ దేశాలు స్పందించిన విధానాన్ని సులభంగా అర్ధం చేసుకునే విధంగా 432 పేజీలలో వివరించారు దేవి.
స్కాట్లాండ్లోని శాస్త్రవేత్తలు, ప్రభుత్వానికి చాలా దగ్గరి సంబంధం వుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.‘ప్రివెంటబుల్’’ పుస్తకంలో రాబోయే మహమ్మారికి సంబంధించి ఎలా సిద్ధం కావాలి అన్న దానిపై ఆమె విశ్లేషణ చేశారు.
వ్యాక్సిన్లు, ఫేస్మాస్క్లపై తన అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత దేవి సోషల్ మీడియాలో ట్రోలింగ్కు సైతం గురయ్యారు.







