కళలకు, గొప్ప సంస్కృతికి, ప్రకృతి వనరులకు, అపార సంపదకు పుట్టినిల్లు భారతదేశం.అందుకే ఆనాదిగా ఈ రత్న గర్భ విదేశీ దండయాత్రలను ఎదుర్కొంది.నాటిఅలెగ్జాండర్ నుంచి ఆంగ్లేయుల వరకు భారతదేశాన్ని కొల్లగొట్టిన వారే.దేశాన్ని చెప్పు చేతల్లోకి తీసుకోవడంతో పాటు ఇక్కడి సంపదను వారి స్వదేశాలకు తరలించుకుపోయారు.వాటిలో కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం తో పాటు ఎన్నో కళాఖండాలు, ముత్యాలు, పగడాలు, వజ్ర వైడూర్యాలు వున్నాయి.ఇక స్వాతంత్ర్యం వచ్చాకా స్వదేశంలోని దొంగల వల్ల మనదేశ సంపద ఖండాలు దాటుతోంది.
కోట్లాది రూపాయల డబ్బుకు ఆశపడి కొందరు భారతీయులే దేవాలయాల్లోని సంపదను కొల్లగొట్టి విదేశాలకు విక్రయిస్తున్నారు.అలా భారతీయ సంపద.
విదేశాల్లోని ఆర్ట్ గ్యాలరీల్లో, మ్యూజియాల్లో మగ్గుతోంది.అయితే కేంద్ర ప్రభుత్వంతో పాటు కొందరి కృషి ఫలితంగా ఆ అపురూప సంపద తిరిగి భారతదేశానికి చేరుకుంటోంది.
ఇటీవల మనదేశానికి చెందిన 29 కళాఖండాలను తిరిగి అప్పగించినందుకు ఆస్ట్రేలియాకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే.భారత్కు తిరిగి వచ్చిన పురాతన కళాఖండాల జాబితాలో ఇది తాజాది.
ఇందులో శిల్పాలు, పెయింటింగ్స్, ఫోటోలు, తాళపత్ర గ్రంథాలు వున్నాయి.తొమ్మిదవ శతాబ్ధానికి చెందినవిగా భావిస్తోన్న ఈ కళాఖండాలను నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా రక్షిస్తూ వచ్చింది.
గతేడాది సెప్టెంబర్లో అమెరికా ప్రభుత్వం 157 కళాఖండాలను ఇండియాకు అప్పగించింది.భారత్లోని ప్రాచీన దేవాలయాల నుంచి ప్రతి ఏటా వేలకొద్దీ కళాఖండాలు దొంగిలించబడుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ కోట్లలో వుంటుందని అంచనా.

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, సింగపూర్తో పాటు అమెరికా తదితర దేశాల పర్యటనల సమయంలో ప్రధాని మోడీ భారతీయ కళాఖండాలను వెనక్కి తీసుకొచ్చారు.ఇలా తెచ్చిన వాటిని మ్యూజియంలలో సంరక్షిస్తామని కేంద్రం చెబుతున్నప్పటికీ.కొందరు సామాజిక కార్యకర్తలు మాత్రం వీటిని వాటి పూర్వ స్థానాలైన దేవాలయాలలో వుంచాలని కోరుతున్నారు.
ఇకపోతే.ప్రస్తుతం బ్రిటీష్ క్రౌన్ జువెల్స్లో భాగంగా వున్న ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రాన్ని తిరిగి పొందడం కోట్లాది మంది భారతీయులకు కల.చట్ట విరుద్ధంగా దొంగిలించబడిన పురాతన వస్తువులను తిరిగి పొందేందుకు అంతర్జాతీయ సహకారానికి భారత్ ప్రాధాన్యతను ఇస్తోంది.అలాగే ఐక్యరాజ్యసమితి అనుబంధ యునెస్కో సహాయాన్ని తీసుకుంటోంది.
డిజిటల్ ఇన్వెంటరీలను , సాంస్కృతిక ఆస్తికి సంబంధించిన డాక్యుమెంటేషన్ను అభివృద్ధి చేయాలని యునెస్కో కోరుతోంది.ఇలాంటి మెకానిజమ్లు ఒకవేళ దొంగతనం జరిగినా, చట్టవిరుద్ధమైన వ్యాపార మార్గాల్లో వీటి ప్రవేశాన్ని అడ్డుకుంటాయని యునెస్కో చెబుతోంది.
సింగపూర్కు చెందిన ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ అనే స్వచ్చంధ సంస్థ ప్రాచీన భారతీయ కళాఖండాలే ఏయే దేశాల్లో వున్నాయో గుర్తిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తోంది.ఈ ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అయ్యింది.







