రాజకీయంగా జనసేన పార్టీ స్పీడ్ పెంచింది.ప్రజా ఉద్యమాలు , ఆందోళనలు తరచుగా చేపడుతూ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిత్యం జనాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది.
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉండడంతో జనసేన అలర్ట్ అవుతోంది.క్షేత్రస్థాయిలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే అంశంపైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు.
దీనిలో భాగంగానే ఈ రోజు జనసేన లోని పూర్తి కార్యవర్గంతో సమావేశానికి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.జనసేన పార్టీలో ఉన్న అన్ని వ్యవస్థలు ఈ సమావేశంలో పాల్గొంటాయి.
ఈ సందర్భంగా పొత్తుల వ్యవహారం పై ఈ సమావేశంలో చర్చించి , అందరి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు.
ఎన్నికలకు ఏవిధంగా సిద్ధమవ్వాలి ? పొత్తుల వ్యవహారం లో పార్టీ నాయకుల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది స్పష్టంగా తెలుసుకోనున్నారు.ప్రస్తుతం ఏపీలో విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలు తీవ్ర అసంతృప్తి నెలకొంది.ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచము అని జగన్ ప్రకటించినా, వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడం, , అన్ని పెరుగుతున్నాయి దాంతోపాటే విద్యుత్ చార్జీలు పెరిగాయి అంటూ వైసిపి నాయకులు అధికారులు చెప్పడం, వీటన్నిటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు జనసేన సిద్ధమవుతోంది.
ఈ రోజు నిర్వహించిన సమావేశంలో దీనికి సంబంధించిన పూర్తిస్థాయిలో క్లారిటీ తెచ్చుకోబోతున్నారు.ఇక విద్యుత్ చార్జీలు అంశంతో పాటు , ప్రజా సమస్యల విషయంలో అలర్ట్ గా ఉంటూ ఎక్కడికక్కడ స్థానికంగా నిరసన కార్యక్రమాలకు జనసేన శ్రీకారం చుట్టబోతుంది.
అయితే పార్టీ నిర్వహించే కార్యక్రమాలు హైలెట్ కావాలన్నా, జనసేన లోనూ ఉత్సాహం పెరగాలన్నా తప్పనిసరిగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఆందోళన కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనాలి.ఇక ఎన్నికల వరకు నిరంతరంగా ప్రజల్లోనే ఉంటూ, ప్రజా బలం పెంచుకునే విషయంపైనే పవన్ దృష్టి సారించాలి.అయితే తీరికలేని సినిమా షెడ్యూల్ కారణంగా పవన్ పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండలేని పరిస్థితి.దీంతో పార్టీ శ్రేణులు మాత్రమే ఈ ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి.