తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు విద్యాశాఖపై కీలక సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఆగష్టు నెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందని కీలక ప్రకటన చేశారు.
ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసి విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
కేసీఆర్ ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని….విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని….దీర్ఘకాలిక వ్యూహాల అమలు ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తామని తెలిపారు.అధికారులు ఇందుకోసం నిపుణులు, విద్యావేత్తలతో సమావేశం నిర్వహించి వాళ్ల సలహాలు, సూచనలను తీసుకోవలని కేసీఆర్ చెప్పారు.
రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతామని వ్యాఖ్యలు చేశారు.
అనాథ బాలలు పదో తరగతి వరకు కస్తూర్బా పాఠశాలల్లో చదువుతూ పై తరగతుల విషయంలో ఇబ్బందులు పడుతూ ఉండటంతో వాళ్ల విషయంలో కూడా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అనాథ పిల్లలు పై తరగతులు చదవడానికి త్వరలో విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించి విద్యార్థుల పై తరగతులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు.
రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి తీరతామని అన్నారు.మిగిలిన విద్యార్థులకు మాత్రం ఎటువంటి పరీక్షలు లేకుండనే పై తరగతులకు పంపుతామని చెప్పారు.
పరీక్షలు, విద్యా సంస్థల నిర్వహణ కొరకు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో పాటు యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాలను పాటించాలని అధికారులకు సూచించారు.