జమ్మూ కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి ని కల్పించే ఆర్టికల్ 370 ని ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ సంచలన నిర్ణయం తో అక్కడ ఎలాంటి అంచాననీయ సంఘటనలు చోటుచేసుకోకూడదు అన్న ఉద్ద్యేశ్యం తో అక్కడి శాంతి భద్రతల దృష్ట్యా అక్కడ ఫోన్లు,ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేసిన విషయం తెలిసిందే.
అయితే గత 47 రోజులుగా అక్కడి ప్రజలకు ఎటువంటి కమ్యూనికేషన్ వాహకాలు అందుబాటులో కూడా లేవు.అలాంటిది అక్కడ సర్వీసులు లేకపోయినా టెలికాం కంపెనీలు భారీగా బిల్లులు పంపుతున్నాయంటూ కాశ్మీరీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.370 ఆర్టికల్ రద్దు తర్వాత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ ఆగష్టు 5 నుంచి ఫోన్ సర్వీసులు నిలిపివేశారు.‘ మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సర్వీసులు ఎప్పట్నుంచో ఆపేశారు.అయినా నాకు ఎయిర్టెల్ నుంచి రూ.779 బిల్లు వచ్చింది.సర్వీసులు ఇవ్వకపోయినప్పటికి బిల్లులు ఎందుకు పంపిస్తున్నారో తెలియడం లేదు’ అంటూ అక్కడి ప్రజలు వాపోతున్నారు.

కాగా 2016లో నిరసనలు జరిగిన సమయంలోనూ టెలికాం సర్వీసులు నిలిపివేశారని కానీ అప్పుడు బిల్లుల నుంచి మినహాయింపు ఇచ్చారని అక్కడి ప్రజలు చెప్తున్నారు.అయితే గత కొద్దీ రోజులుగా సర్వీస్ లేకపోయినప్పటికీ ఇలాగ బిల్లులు రావడం పై అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.







