టీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తిగా, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ఉంటూ ప్రస్తుతం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈటెల రాజేంద్ర పై కేసీఆర్ గుర్రుగా ఉన్నారట.ఫలితంగా ఆయన పై వేటుపడే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఈటలను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం కూడా జోరందుకుంది.ఈ మేరకు టీఆర్ఎస్ అనుకూల మీడియా లో కూడా పెద్ద ఎత్తున కథనాలు ప్రచారం అవుతుండడంతో తెలంగాణాలో ఇది హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ రాజేందర్ పై కేసీఆర్ ఈ స్థాయిలో ఫైర్ అవ్వడానికి కారణం కూడా అంతే స్థాయిలో ఉందట.ఇటీవల కలెక్టర్ల సమావేశం జరిగింది.
రెవెన్యూ చట్టంలో తీసుకురావాల్సిన మార్పులపై కలెక్టర్లతో సీఎం కేసీఆర్ చర్చించారు.

అయితే ఈ మీటింగ్ తర్వాత మంత్రి ఈటల రాజేందర్ను రెవెన్యూ సంఘాల కీలక నేతలు కలవడంతో ఈ వివాదం మొదలయినట్టు తెలుస్తోంది.
కేసీఆర్ ఆలోచన మేరకు కొత్త రెవెన్యూ చట్టంలో ప్రస్తుత తహశీల్దార్లు, ఇతర స్థాయిలోని అధికార్ల హక్కులకు భంగం వాటిల్లే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టబోతున్నట్టు లీకులు వచ్చాయి.ఈ లీకులు ఎంత వరకు నిజమో, కాదో తెలియదు కానీ దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.
ఓ వైపు ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు ఆందోళన చేస్తూ కొత్త చట్టం వద్దంటూ వినతులు మీద వినతులు ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ లీకు బయటకు ఎలా వచ్చింది ? దీనికి కారకులు ఎవరు అనేదానిపై ఆరా మొదలయ్యింది.ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ పేరు తెర మీదకు వచ్చింది.అసలు రెవెన్యూ చట్టం గురించి ఎక్కడా, ఏ విధమైన లీకులు చేయవద్దంటూ మంత్రులకు, కలెక్టర్లకు సీఎం కేసీఆర్ గట్టిగా హెచ్చరికలు చేశారు.
అయితే ఈటెల ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా కలెక్టర్ల మీటింగ్ లో జరిగిన చర్చల సారాంశాన్ని రెవెన్యూ సంఘ ప్రతినిధులకు చెప్పినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.

ఈ మేరకు ఈటెల లీకుల మీద సీఎంకు ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.రెవెన్యూ చట్టానికి తూట్లు పడేలా ఈటెల వ్యవహారం ఉందని సీఎం ఓ అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది.కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించి ఉద్యోగ సంఘాలు ఆందోళన బాటకు దిగే ఆలోచనలో కూడా ఉండడంతో ఈటలపై సీఎంకు ఆగ్రహం పెరగడానికి కారణమైందని పలు వర్గాలు చెబుతున్నాయి.
దీంతో ఈటలకు మంత్రి వర్గం నుంచి తప్పిస్తారనే ప్రచారం మొదలయ్యింది.అయితే ఈ లీకుల వెనుక సీఎంవోలోని ఓ పీఆర్వో పాత్ర ఉందని టీఆర్ఎస్ లో మరో వర్గం ఆరోపిస్తోంది.
ఈ వ్యవహారంలో ఈటెలను బాద్యుడిని చేస్తూ టీఆర్ఎస్ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంకూడా దీనిలో భాగమేనని కొందరు అనుమానిస్తుండగా, మరికొందరు మాత్రం ఈటెల హరీష్ రావు తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుండడం కూడా కేసీఆర్ ఆగ్రహానికి కారణం అని చెబుతున్నారు.







