తెలంగాణాలో అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ విషయంలో అనవసరంగా తొందరపడి ఇప్పుడు విమర్శలపాలయ్యామనే అంతర్మథనంలో పడిపోయింది వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ.తెలంగాణాలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే… వైసీపీ నేతలు టీడీపీ మీద ఉన్న రాజకీయ వైరంతో… టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాదు… భారీ ఎత్తున ఫ్లెక్సీలు పెట్టడం… విజయోత్సవ ర్యాలీలు చెయ్యడం పెద్ద సంచలనం సృష్టించింది.
తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉంది.వైసీపీ, జనసేన పార్టీలు అసలు పోటీ జోలికే వెళ్లలేదు.
కూకట్పల్లి సహా పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు వైసీపీ బహిరంగంగానే మద్దతు ప్రకటించింది.ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.
ఆ పార్టీ అభ్యర్థులను పిలిపించి మద్దతు కూడా ప్రకటించారు.అయితే ఇప్పడు అదే టీడీపీ తన అస్థ్రాలుగా మార్చుకుని వైసీపీ మీద ప్రయోగించేందుకు సిద్ధం అవుతోంది.

ఏపీలో వైసీపీని ఇరుకునపెట్టేలా… టీడీపీ పెద్ద ప్లానే రెడీ చేసుకుంది.ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో అడుగడుగునా అడ్డుపడుతూ… ఏపీ ప్రజలను ఇష్టమొచ్చినట్టు తిట్టిన కేసీఆర్కు వైసీపీ ఎలా మద్దతు ప్రకటిస్తుంది అని టీడీపీ నేతలు వైసీపీ మీద ఇప్పుడు విరుచుకుపడుతున్నారు.అసలు తెలంగాణాలో టీఆర్ఎస్ గెలవడం ఏంటి.? ఏపీలో వైసీపీ సంబరాలు చేసుకోవడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఇక అంతటితో ఆగకుండా… టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పది ప్రశ్నలతో జగన్కు బహిరంగ లేఖ కూడా రాసేసాడు.ఇప్పుడు టీడీపీ లేవనెత్తిన ఈ వాదన ప్రజల్లో చర్చకు దారితీసింది.
ఏపీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జగన్ వ్యవహరిస్తున్నారనీ, ఏపీ వ్యతిరేకులతో జగన్ చేతులు కలుపుతున్నారనీ బహిరంగంగానే వైసీపీ మీద టీడీపీ నాయకులు విరుచుకుపడడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయింది.

ఇప్పటికే వైసీపీ, జనసేన, టీఆర్ఎస్ పార్టీలు మోదీకనుసన్నల్లో పనిచేస్తున్నాయని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.టీఆర్ఎస్తో చేతులు కలిపిన వైసీపీ ఏపీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని భారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు.అయితే వైసీపీ కూడా దీనిపైనా గట్టిగానే విమర్శలు ప్రారంభించింది.
తెలంగాణలో కూటమికి పట్టిన గతే ఏపీలో చంద్రబాబుకూ పడుతుందని శాపనార్ధాలు కూడా పెట్టేస్తున్నారు.అసలు రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్తో టీడీపీ ఎలా పొత్తుపెట్టుకుంటుందని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
ఇలా ఇరు పార్టీల నాయకుల పరస్పర ఆరోపణలు విమర్శలతో ఏపీలో రాజకీయం హీటెక్కిపోతోంది.టీడీపీ పై వైసీపీ ఎంత ఎదురుదాడి చేసినా… లోలోపల మాత్రం అనవసరంగా తొందరపడ్డామా అనే పశ్చాతాపం కూడా వైసీపీలో కనిపిస్తోంది.







