అక్కినేని అఖిల్ హీరోగా ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక చిత్రం రూపొందుతోంది.విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
ప్రస్తుతం సినిమా చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు.వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడం ఖాయం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం తర్వాత అఖిల్ చేయబోతున్న సినిమా ఏంటీ అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.బోయపాటి దర్శకత్వంలో అఖిల్ మూవీ ఉంటుందని అంతా భావించారు.
నాగార్జున తన కొడుకుతో ఒక మూవీ చేయాల్సిందిగా చాలా రోజుల క్రితం బోయపాటిని సంప్రదించడం జరిగిందట.అయితే ఆ సమయంలో ఇతరత్ర కమిట్మెంట్స్ కారణంగా బోయపాటి నో చెప్పాడు.తాజాగా అఖిల్, బోయపాటిల మూవీ సెట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.కాని ఈ వార్తలు నిజం కాదని తేలిపోయింది.దర్శకుడు బోయపాటి స్వయంగా ఆ విషయాన్ని ప్రకటించాడు.నందమూరి ఫ్యాన్స్ను మరోసారి ఫిదా చేయాలనే ఉద్దేశ్యంతో తన తదుపరి చిత్రాన్ని బాలయ్యబాబుతో ఫిక్స్ చేసుకున్నట్లుగా బోయపాటి ప్రకటించాడు.
బాలకృష్ణ, బోయపాటిల కాంబినేషన్లో తెరకెక్కిన ‘సింహా’ మరియు ‘లెజెండ్’ చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.అందుకే చాలా కాలంగా నందమూరి అభిమానులు వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు ఆ హ్యాట్రిక్ మూవీ వచ్చే ఏడాది ప్రారంభం కాబోతుంది.ప్రస్తుతం చరణ్తో తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’ చిత్రం విడుదల ఏర్పాట్లు చేస్తున్న బోయపాటి తదుపరి చిత్రంను బాలయ్యతోనే అంటూ ఖరారు చేయడంతో అక్కినేని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్యతో మూవీ చేసిన తర్వాత అయినా అఖిల్ కోసం బోయపాటి మూవీ చేస్తాడా అనేది చూడాలి.