తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ ఓటమే తమ అందరి ఉమ్మడి లక్ష్యం అన్నట్టుగా.విపక్ష పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి.
టీఆర్ఎస్ పార్టీ ప్రభావం తగ్గించేలా అనేక ఎత్తుగడలు చర్చించారు.ఎన్నికల్లో కలిసికట్టుగా ప్రచారం చేయడంతో పాటు ఉమ్మడిగా కేసీఆర్ దూకుడుని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుంటున్నారు.
ఇంతవరకు అంతా అనుకున్నట్టుగానే అయ్యింది.అయితే సీట్ల విషయానికి వచ్చేసరికి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడంలేదు.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలి.ఎక్కడెక్కడ కేటాయించాలి అనేది పెద్ద కన్ప్యూజన్ గా మారింది.
కాంగ్రేస్.టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మహా కూటమిలో ఉన్నాయి.తెలుగుదేశం పార్టీ ఇరవై స్థానాలు, సీపీఐ ఎనమిది స్థానాలు, టీజేఎస్ పదిహేను స్థానాల్లో పోటీచేసేందుకు చూస్తున్నారు.అందుకోసం ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.పొత్తుల చర్చల కోసం సిద్ధమయ్యారు.ఇంతవరకు బాగానే ఉన్నా కాంగ్రెస్ వైపు నుంచి అందుకు భిన్నమైన సంకేతాలు వెలువడుతున్నాయి.
అన్ని పార్టీలకు ఇరవైకి మించి స్థానాలు ఇవ్వకూడదన్న ఆలోచనతో హస్తం పార్టీ ఉంది.పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా గెలిచే స్థానాలు వదులుకోకూడదంటూ పార్టీ నేతలకు హితబోధ చేశారు.
జూబ్లిహిల్స్, శేరిలింగం పల్లి, కూకట్ పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కుద్బుల్లాపూర్, రాజేంద్రనగర్ స్థానాలను టీడీపీ తమకు కేటాయించాల్సిందిగా కోరుతోంది.అయితే అక్కడ కాంగ్రేస్ కు పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, బిక్షపతి యాదవ్, సుధీర్ రెడ్డి, కూనాశ్రీశైలం గౌడ్, మాజీ మంత్రి సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి వంటి బలమైన నాయకులున్నారు.
జిల్లాల్లో కూడా టీడీపీ అడుగుతోన్న స్థానాల్లో కాంగ్రేస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటం పొత్తులకు ఇబ్బందిగా మారే అవకాశంఉంది.ఇక కొత్తగూడెం, హుస్నాబాద్, బెల్లంపల్లి, వైరా, దేవరకొండ,మునుగోడు నియోజకవర్గాలను సీపీఐ కోరుతోంది.
గత ఎన్నికల్లో ఐదో స్థానంలో నిలిచిన సీపీఐ కి కొత్తగూడెం ఇవ్వొద్దంటూ ఇప్పటికే అక్కడి కాంగ్రేస్ నేత వనమా వెంకటేశ్వరరావ్ ఆందోళన బాటపట్టారు.వైరాది కూడా అదే పరిస్థితి.
హుస్నాబాద్ లో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి బలమైన అభ్యర్థిగా కాంగ్రేస్ భావిస్తోంది.టీజేఎస్ అడుగుతోన్న చోట కూడా కాంగ్రేస్ పార్టీ అభ్యర్థులే బలంగా ఉన్నారన్న భావనలో హస్తం పార్టీ ఉంది.ఇన్ని స్థానాలను సర్ధుబాటు చేసుకోవడం కూటమీ పార్టీలకు తలనొప్పిగా మారబోతోంది.ఈ నేపథ్యంలోనే కాంగ్రేస్ గెలిచే స్థానాలను వదులుకోమంటూ ప్రకటనలు చేస్తోంది.