నాయకుడు అంటే తన టీమ్ ని ముందుండి నడిపిస్తూ వారికి దిశా నిర్ధేశం చేసేవాడు.ఒక టీమ్ లో నాయకుడి నిర్ణయం ఫైనల్.
అతను చెప్పినట్టే మిగతావారంతా నడుచుకోవాలి.ఇది రాజకీయ పార్టీల విషయంలోనూ అంతే.
ఇక్కడ పార్టీ అధినాయకుడి నిర్ణయమే అంతిమం.ఇక క్రమశిక్షణ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీనే గుర్తుకు వస్తుంది.
ఏ పీర్టీలో ఎలా ఉన్నా టీడీపీ లో నాయకులూ చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు.అధినేత ఏది చెప్తే అదే జరుగుతుంది తప్ప మిగతావారు ఎవరూ దాన్ని వేలెత్తి చూపించే పరిస్థితి లేదు. అయితే అదంతా ఒకప్పుడు.ఇప్పుడు టీడీపీ లో పరిస్థితి మారిపోయింది.పార్టీలో వలస నాయకులు పెరగడంతో వారు చంద్రబాబు ను ఏ మాత్రం లెక్కచేయడంలేదు.మరికొంతమంది పార్టీ సీనియర్లు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడు టీడీపీ లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.చంద్రబాబుతో సంబంధం లేకుండానే ఎవరిష్టం వచ్చినట్లు వారు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు.ఇంకొందరైతే చంద్రబాబు పైనే ఒత్తిడి పెట్టి తమదారిలోకి తెచ్చుకునే స్థాయికి వెళ్లిపోయారు.దీంతో బాబు వారి విషయంలో మౌనంగా ఉండలేక, గట్టిగా మాట్లాడలేక సతమతం అయిపోతున్నాడు.ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే.జేసీ బ్రదర్స్ బాబు ని అస్సలు లెక్కచేయడంలేదు.
వచ్చే ఎన్నికల్లో తనకు బదులుగా తన కుమారుడు ఎంపిగా పోటీ చేస్తారంటూ జేసి దివాకర్ రెడ్డి ప్రకటించేసుకున్నారు.తాడిపత్రిలో తన కుమారుడే పోటీలో ఉంటారని జేసి ప్రభాకర్ రెడ్డి ప్రకటించి టీడీపీ లో కలకలం రేపాడు.
గత ఎన్నికల ముందు పార్టీలో చేరిన జేసీ బ్రదర్స్ సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప ఒక పార్టీ ఉందని, ఆ నాయకుడి మాట మీద ముందుకు వెళ్ళాలి అనే విషయాలు ఏవి పట్టించుకోవడంలేదు.జేసీ బ్రదర్స్ పిల్లలద్దరు పోటీ చేస్తారని ప్రకటించుకోవటం ఒక ఎత్తైతే జిల్లాలో తాను చెప్పిన వారికే టిక్కెట్లు ఇవ్వాలంటూ ఎంపి దివాకర్ రెడ్డి చంద్రబాబుకే కండీషన్లు పెడుతుండటమే విచిత్రంగా ఉంది.
జిల్లాలోని 14 సీట్లలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాను చెప్పిన వారికే టిక్కెట్లు ఇవ్వాలంటూ చంద్రబాబు ముందు ఓ జాబితా కూడా పెట్టారట.మేము చెప్పిన వారికి టికెట్ ఇవ్వకపోతే మా తడాఖా చూపిస్తాం అంటూ సవాల్ కూడా చేస్తున్నారు.
ఇక, ప్రకాశం జిల్లా పరిస్దితి కూడా దాదాపు ఇలానే ఉంది.ఎంఎల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డిని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎంపిగా పోటీ చేయమని అడిగారు.ఒంగోలు ఎంపి పరిధిలో తాను చెప్పిన వారికి ఎంఎల్ టిక్కెట్లు ఇస్తేనే తాను ఎంపిగా పోటీ చేస్తాననే కండీషన్ పెట్టారట.కర్నూలు జిల్లాలో పరిస్దితులు కూడా ఇదే విధంగా ఉన్నాయి.
కర్నూలు, ఆళ్ళగడ్డ, నంద్యాల, బనగానపల్లి నియోజకవర్గాల్లో ఎవరికివారుగా టిక్కెట్లు ప్రకటించేసుకుంటున్నారు.
కడప జిల్లాలో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, కమలాపురం నియోజకవర్గాల్లో కూడా అక్కడి నేతలదే హవా.వారెవరూ చంద్రబాబు మాట వినే పరిస్దితుల్లో లేరు.విశాఖపట్నం జిల్లాలోని భీమిలి, అనకాపల్లి, విశాఖపట్నం దక్షిణంలో కూడా ఇంతే .తూర్పుగోదావరి జిల్లాలోని తుని, చోడవరం రాజమండ్రిలో కూడా యనమల రామకృష్ణుడే టిక్కెట్లు ఇప్పటికే ప్రకటించేసుకున్నాడు.ఇలా ఎవరికి వారు ఇష్టమొచ్చినట్టు ధిక్కార స్వరాలు వినిపించడం గతంలో ఎప్పుడూ లేదు.
ఈ పరిస్థితులు అన్ని చూస్తుంటే పార్టీ పై బాబు పట్టు కోల్పోతున్నట్టే కనిపిస్తోంది.
.