నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం ఈనెల 31న విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కానందున విడుదల వాయిదా వేయడం జరిగింది.కేరళ వరదల కారణంగా శైలజ రెడ్డి అల్లుడు రీ రికార్డింగ్ వర్క్ను సంగీత దర్శకుడు పూర్తి చేయడంలో విఫలం అయ్యాడు.
దాంతో సినిమాను వాయిదా వేసినట్లుగా స్వయంగా నాగచైతన్య ప్రకటించాడు.త్వరలోనే కొత్త తేదీని ప్రకటించేందుకు సినిమా యూనిట్ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.
శైలజ రెడ్డి అల్లుడు చిత్రాన్ని మరీ ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని, లేదంటే దసరా సీజన్కు పెద్ద సినిమాలతో పోటీ పడాల్సి వస్తుందని భావిస్తున్నారు.
సెప్టెంబర్ 7న ఎలాగూ సాధ్యం కాదు కనుక ఆ తర్వాత వారం అంటే సెప్టెంబర్ 13 లేదా 14న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.అయితే అదే సమయానికి సమంత నటించిన ‘యూటర్న్’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.ఇప్పటికే యూటర్న్కు సంబంధించిన అన్ని పనులు పూర్తి అయ్యాయి.
బిజినెస్ను కూడా క్లోజ్ చేయడం జరిగింది.ఈ సమయంలో సినిమాను విడుదల వాయిదా వేయడం కష్టం అంటూ యూటర్న్ నిర్మాతలు తేల్చి చెప్పారు.
దాంతో సమంతకు పోటీగానే నాగచైతన్య అల్లుడు రాబోతున్నట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు.
‘యూటర్న్’ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానున్న విషయం తెల్సిందే.
ఒకటి రెండు రోజులు అటు ఇటుగా శైలజ రెడ్డి అల్లుడు చిత్రాన్ని విడుదల చేయడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాని అలా చేయడం వల్ల సమంత, నాగచైతన్యల మద్య ఏదైనా సమస్య తలెత్తే అవకాశం కూడా లేకపోలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎంతగా ప్రయత్నించినా శైలజ రెడ్డి అల్లుడు చిత్రానికి మంచి డేట్ను ఫిక్స్ చేయడం నిర్మాతల వల్ల కావడం లేదు.
సెప్టెంబర్ చివర్లో నాగార్జున, నాని నటించిన ‘దేవదాసు’ చిత్రం విడుదల కాబోతుంది.తండ్రి సినిమాకు పోటీ వద్దనే ఉద్దేశ్యంతో ముందే రావాలని నాగచైతన్య భావిస్తున్నాడు.దేవదాసు విడుదల తర్వాత దసరా కోసం ఎదురు చూస్తున్న చిత్రాలు రాబోతున్నాయి.
ఇలా శైలజ రెడ్డి అల్లుడు చిత్రం ఎట్టి పరిస్థితుల్లో సమంత యూటర్న్ చిత్రానికి పోటీగా విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ విషయంలో చైతూ, సమంతలు ఎలా వ్యవహరిస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.