ఏదైనా ఒక ఫార్ములా సక్సెస్ అయితే దాదాపు అందరూ అదే ఫార్ములా ఉపయోగిస్తుంటారు.ఎందుకంటే అంతిమంగా కావాల్సింది సక్సెస్.
ఇక ఇదే ఫార్ములాను ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అదే చేస్తున్నారు.జగన్ చేపడుతున్న పాదయాత్ర ఆ పార్టీకి మంచి ఊపు తీసుకొస్తుండడంతో పాటు స్థానిక సమస్యలు ఏమిటి .? ప్రజలు ఏమి కోరుకుంటున్నారు.? అనే విషయాలు స్వయంగా తెలుసుకోవడానికి వాటి పై హామీలు ఇవ్వడానికి వీలు పడుతోంది.దీని కారణంగా ప్రజల్లో ఆ పార్టీ పై అనుకూలత ఏర్పడుతోందని వైసీపీ బాగా గ్రహించింది.అందుకే ఆ పార్టీ నాయకులంతా ఎక్కడికక్కడ పాదయాత్రలు చేపట్టే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

కొద్ది రోజుల క్రితం జగన్ పాదయాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించక ముందే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖ నగరంలో మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు.ప్రజాసమస్యలను తెలుసుకున్నారు.వైసీపీ సీనియర్ నేత, తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా ప్రకాశం జిల్లాలో దాదాపు రెండు వందల కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టారు.ప్రకాశం జిల్లాకు వెలుగొండ ప్రాజెక్టు జీవనాధారం.
ఆ ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడం లేదని, కావాలని ప్రకాశం జిల్లాకు అన్యాయం చేస్తుందని వైవీ ఆరోపిస్తూ యాత్రకు శ్రీకారం చుట్టారు.

అన్ని జిల్లాల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా, ప్రజాసమస్యలపై ప్రభుత్వం పై వత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాలను రూపొందించుకోవాలని పార్టీ కేంద్ర కార్యాలయం పిలపునిచ్చింది.ఈమేరకు ఎక్కడిక్కడ జిల్లా నేతలు కార్యాచరణను రూపొందించుకుంటున్నారు.జగన్ పాదయాత్రను ముగించుకుని తిరిగి బస్సుయాత్రతో జిల్లాలకు చేరే వరకూ ఏదో ఒక కార్యక్రమాన్ని రూపొందించుకునే దిశగా పార్టీ నాయకులు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలతో వైసీపీ నాయకులు హోరెత్తించేలా ఉన్నారు.