ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడం తోపాటు భారీగా సొమ్ములు ఖర్చు పెట్టారు.తాము గెలవడం తోపాటు పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది.
ఇంకేముంది తాము ఆడిందే ఆట అనుకున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు.ఇక నియోజకవర్గం అంతా తమ గుప్పెట్లో ఉంటుందని, పనులకోసం జనాలు తమ ఇంటి చుట్టూ తిరుగుతారని, తాము కూడా ఎంతోకొంత వెనకేసుకోవచ్చని ఇలా ఎన్నో కలలు కన్నారు.
కానీ గెలిచిన కొద్దిరోజుల్లోన సీన్ మొత్తం మారిపోవడంతో వైసీపీ ఎమ్మెల్యేల్లో గెలిచామన్న ఆనందం గాని, సంతృప్తిగానీ ఎక్కడా లేకుండా పోయింది.జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల వద్దకే అందడంతో పాటు ప్రతి పనిని ఆన్లైన్ చేయడం తదితర కారణాలతో ఎమ్మెల్యేల అవసరమే ప్రజలకు లేకుండా పోయింది.
అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి దీని కారణంగా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది.
సీనియర్ ఎమ్మెల్యేలు ఈ విషయంలో పెద్దగా ఇబ్బంది పడకపోయినప్పటికే కొత్తగా గెలిచిన వారు మాత్రం కంగారు పడిపోతున్నారు.ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని శాసిద్దమని కలలుగన్న వారికి ఆ అవకాశం లేకుండా చేశారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా జనాలకు జగన్ తప్ప ఎమ్మెల్యే అవసరమే లేకుండా పోయింది.
కొత్తగా పథకాలు ఏవైనా ప్రవేశపెడితే గతంలో ఎమ్మెల్యే చేతిలోని అవన్నీ ఉండేవి.ఎవరికి ఏమి కావలసి వచ్చినా ఎమ్మెల్యే సంతకం తప్పనిసరిగా కావాల్సి వచ్చేది.అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా జగన్ చేసేసారు.ఇక ఎమ్మెల్యేలకు ఆదాయం తెచ్చిపెట్టే మద్యం దుకాణాలు, ఇసుక వంటి వాటిలో కొత్త నిబంధనలు అమలు చేసి ఎమ్మెల్యేల ఆదాయానికి జగన్ గండికొట్టాడు.
ఇప్పుడు జగన్ అనుసరిస్తున్న తీరుతో సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారు.పైకి మాత్రం చిరునవ్వులు చిందిస్తూ లోలోపల తమ బాధను అనుచరులు దగ్గర చెప్పుకుంటూ ఓదార్పు పొందుతున్నారు.ఎమ్యెల్యేల బాధ జగన్ వరకూ వెళ్లినా ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్రభుత్వంపై అవినీతి మరకలు పడకూడదని, ప్రతి పనిలోనూ పారదర్శకత చూపించాలని చెబుతున్నాడు.అందుకే పదే పదే అవినీతి విషయంలో ఎమ్యెల్యేలకు, మంత్రులను పిలిచి మరీ క్లాస్ పీకుతున్నాడు.
పాపం అధికార పార్టీ ఎమ్యెల్యేలకు ఎంత కష్టం వచ్చిందో కదా !
.