అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా పేరు మార్పు ప్రకటనతో అమలాపురంలో జరిగిన విధ్వంసకర సంఘటనకు సంబంధించిన కేసుల ఉపసంహరణకు చిత్తశుద్ధితో పనిచేస్తామని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు.
శనివారం స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైసిపి రాష్ట్ర నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణిలతో కలిసి వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరణలో భాగంగా కోనసీమ జిల్లాకు నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో జరిగిన విధ్వంసకర సంఘటనలో మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లను ఆందోళనకారులు తగలబెట్టడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించారన్నారన్నారు.
ఈ సంఘటనలో పోలీసులు వీడియోల ఆధారంగా కేసులు నమోదు చేసి 300 మందిని అదుపులోకి తీసుకున్నారన్నారు.కొన్ని రాజకీయ శక్తులు వెనుక ఉండి లేనిపోని అపోహలు సృష్టించారన్నారు.
ఏం జరుగుతుందోనని చూసేందుకు వెళ్లినవారిలో విద్యార్థులు, అమాయకులు ఉన్నారని వారి భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని దీంతో కేసుల ఉపసంహరణను వారు కొరుతున్నారని అయితే ఉద్దేశ్యపూర్వకంగా ఇళ్ళు తగలబెట్టిన వారిని ముద్దాయిలుగా పెట్టారన్నారు.
గతంలో కాపు ఉద్యమం సంఘటనలో కూడా ప్రభుత్వం కేసులు పెట్టిందని కేంద్ర ప్రభుత్వం ఆధీనం ఉన్నవి తప్ప రాష్ట్రం ఆధీనంలో ఉన్న కేసులన్నీ ప్రభుత్వం ఉపసంహరించుకుందన్నారు.
అదేవిధంగా ఈ కేసులు ఉపసంహరణలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామన్నారు.ఈ సమావేశంలో వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, కౌన్సిలర్స్ పోతంశెట్టి వరప్రసాద్, చిట్టూరి సతీష్, ముమ్మిడివరపు బాపిరాజు, పిల్లా వీరబాబు, వల్లూరి రామకృష్ణ, పలివెల సుధాకర్, పెంకె గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.