తెలంగాణలో బిజెపి టీఆర్ఎస్ లకు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బలోపేతం కావాలని ప్రయత్నిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసిన క్రమంలో మరింత స్పీడ్ పెంచుతుంది.ఆ పార్టీ అగ్రనాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు అంతా రాబోయే తెలంగాణ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంపైనే దృష్టి సారించారు.
ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు పాదయాత్రలు, బస్సు యాత్రలు చేపడుతూ, అనేక ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయించుకున్నారు.వాస్తవంగా ఎప్పటి నుంచో తెలంగాణ అంతట పర్యటించి తన పట్టు పెంచుకుని కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూనే వస్తున్నారు.
అయితే ఆయన యాత్రకు సీనియర్ నాయకులు అభ్యంతరం చెబుతూ, అధిష్టానానికి ఫిర్యాదులు చేయడంతో, ఎప్పటికప్పుడు ఆ యాత్ర వాయిదా పడుతూ వస్తోంది.అయితే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో బస్సు యాత్ర లేదా, పాదయాత్ర చేపట్టేందుకు ఏఐసిసి అనుమతి ఇచ్చింది.
పాదయాత్ర చేయాలా లేక బస్సుయాత్ర చేయాలనే విషయంలో కాంగ్రెస్ అధిష్టానంతో పాటు , తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తర్జన భర్జనలు పడుతున్నారు.డిసెంబర్ ఆఖరిలో ఏదో ఒక యాత్ర ప్రారంభించేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు.
బస్సు యాత్ర ఖరారు అయితే దాదాపు పది మంది నేతలు తెలంగాణ వ్యాప్తంగా బస్సులో పర్యటించి పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో పాదయాత్ర రాహుల్ చేపట్టారు.
పాదయాత్ర ముగిసిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలంతా పాదయాత్ర చేయాలని ఏఐసిసి నుంచి ఆదేశాలు వెళ్లాయి.ఈ నేపథ్యంలోనే కర్ణాటక , కేరళ రాష్ట్రాల్లో పిసిసి అధ్యక్షుడు, సీఎల్పీ నేత కలిపి ఒకచోట, విడివిడిగా మరోచోట యాత్ర చేయనున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణలోనూ యాత్ర చేపట్టే అవకాశం ఉంది.అయితే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక్కరే యాత్ర చేస్తారా లేక బట్టి విక్రమార్కను కలుపుకున వెళ్తారా అనేది తేలాల్సి ఉంది.
బట్టి విక్రమార్క పాదయాత్ర చేపడితే రేవంత్ మిగతా బాధ్యతలను చూసుకోవచ్చనే ఒక వాదన తెరపైకి రాగా, ఖచ్చితంగా రేవంత్ పాదయాత్ర చేస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ కు ఊపు వస్తుందని మరో వాదన తెరపైకి వచ్చింది.
అయితే ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.ఇప్పటికే సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టారు.భద్రాచలం నుంచి ప్రారంభమై పినపాక, ములుగు, భూపాలపల్లి, మంథాని, మంచిర్యాల, అసిఫాబాద్ , ఆదిలాబాద్ ,నిజామాబాద్ , మెదక్, రంగారెడ్డి , మహబూబ్ నగర్, నల్గొండ మీదుగా ఆలేరు నుంచి హైదరాబాద్ వరకు యాత్ర చేసేందుకు రూట్ మ్యాప్ ను తయారు చేసుకుని అధిష్టానానికి అందించారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయం పైనే ఎవరు పాదయాత్ర చేపడుతారు అనేది క్లారిటీ రాబోతోంది.అంతకంటే ముందుగా దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధం అవుతోంది.