ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా హుజూరాబాద్ నియోజకవర్గం లో జరగబోయే ఎన్నికల గురించిన చర్చ జరుగుతోంది.ఇక్కడి నుంచి బిజెపి తరఫున ఈటెల రాజేందర్ పోటీ చేస్తుండగా , టిఆర్ఎస్ , కాంగ్రెస్ ల నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది క్లారిటీ రాలేదు.
అయినా అభ్యర్థి ఎవరు అన్నది పక్కన పెడితే, మూడు రాజకీయ పార్టీలు ఉప ఎన్నికల కోసం కష్టపడుతున్నాయి.టిఆర్ఎస్, బిజెపి మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొన్నట్టుగానే కనిపిస్తోంది .ఈ నియోజకవర్గంలో బిజెపి కి పెద్దగా బలం లేకపోయినా, ఈటెల రాజేందర్ కు ఉన్న పలుకుబడి ఈ నియోజకవర్గంలో ఆయన కు ఉన్న పరిచయాలు, కొన్ని ప్రధాన సామాజిక వర్గాల మద్దతు ఇవన్నీ అధికార పార్టీ టిఆర్ఎస్ ను కలవరపడుతున్నాయి.అందుకే ఇక్కడ గెలిచేందుకు కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ, మంత్రులను ,ఎమ్మెల్యేలను కేసీఆర్ నియమించారు.
ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.అలాగే ఇదే నియోజకవర్గం నుంచి కొత్త పథకాలను ప్రవేశపెడుతూ, గెలుపుకు డోకా లేకుండా చూసుకుంటున్నారు.ఇక్కడ కనుక రాజేందర్ ను ఓడించి టిఆర్ఎస్ గెలిచేలా చేయకపోతే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై చర్చ జరుగుతోంది.హుజూరాబాద్ నియోజకవర్గం లో రాజేందర్ కు గెలుపు అవకాశాలు ఉన్నాయని సర్వేలు స్పష్టం చేస్తుండటంతో, ఎక్కడలేని ఆందోళన నెలకొంది.
కేవలం ఇది ఒక హుజురాబాద్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదని , రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని టిఆర్ఎస్ భయపడుతోంది.ఇక్కడ కనుక పార్టీ అభ్యర్థి ఓడితే కోలుకోలేని విధంగా నష్టపోతామని, 2023 లో జరిగే ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయం టిఆర్ఎస్ అగ్రనేతలను వెంటాడుతోంది.
ఇప్పటికే దుబ్బాక నియోజకవర్గం లో ఓడి పరువు పోగొట్టుకున్న మని , హుజురాబాద్ లోనూ అదే రిపీట్ అయితే రాజేందర్ తమపై పైచేయి సాధిస్తాడని, అలాగే రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఓటమి తప్పదనే సంకేతాలు వెలువడతాయి అనే భయం టీఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది.