ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పదవీ బాధ్యతలు చేపట్టాక.ఎంపీ పదవికి రాజీనామా చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మల్కాజ్ గిరి( Malkaz Giri ) ప్రజలకు.ధన్యవాదాలు తెలియజేస్తూ లేఖ విడుదల చేశారు.“అప్రతిహత అధికారాన్నే అస్త్రంగా చేసుకుని, అణచివేతనే మార్గంగా ఎంచుకుని, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకే లేకుండా చేయాలని పాలకులు కక్ష కట్టినప్పుడు… తెలంగాణ లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం… ప్రశ్నించే గొంతుకకు ప్రాణం పోసిన గడ్డ మల్కాజ్ గిరి.కొడంగల్ లో రాజ్యం ఆదేశాలతో పోలీసు లాఠీలు నా ఇంటిపై పడి, నన్ను నిర్భంధించి, నడి రాత్రి ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన సందర్భాన్ని చూసి, చలించిన మల్కాజ్ గిరి… ఆరు నెలలు తిరగక ముందే, కేవలం 14 రోజుల వ్యవధిలో నన్ను తమ గుండెల్లో పెట్టుకుంది.
ప్రశ్నించే గొంతుకై తెలంగాణ మొత్తానికి రక్షణగా నిలబెట్టింది.
ఈ రోజు మీ రేవంతన్న సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ( Congress party )తెలంగాణ గడ్డపై జెండా ఎగరేసిందంటే దానికి పునాదులు పడింది మల్కాజ్ గిరిలోనే.నా రాజకీయ ప్రస్థానంలో కొడంగల్ కు ఎంతటి ప్రాధాన్యత ఉందో… మల్కాజ్ గిరికి అంతే ప్రాధాన్యత ఉంది.నన్ను దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజ్ గిరి ప్రజలదే.
ఏ విశ్వాసంతో, ఏ అభిమానంతో నన్ను గెలిపించారో ఐదేండ్లు మీరు ఆశించిన ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేశాను.విస్తృత బాధ్యతల నేపథ్యంలో వ్యక్తిగతంగా కొన్ని సార్లు అనుకున్నంత సమయం ఇవ్వలేకపోయి ఉండొచ్చు.
అట్లాంటి సందర్భంలో నా పరిస్థితిని మీరు సహృదయంతో అర్థం చేసుకున్నారు.తల్లి తన బిడ్డను దేశ రక్షణ కోసం పంపినట్టు.
.నన్ను మీరు తెలంగాణ రక్షణ కోసం గెలిపించి పంపారు.ఇన్నాళ్లు ఆ బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వర్తించానని భావిస్తున్నాను.ఈ సందర్భంగా మల్కాజ్ గిరి ప్రజలకు పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు.ఐదేళ్లే కాదు ఇక మీతో నా అనుబంధం… నా గుండెల్లో మీ స్థానం శాశ్వతం.మల్కాజ్ గిరికి ఎప్పటికీ రుణపడి ఉంటా.
నాడు మీరు పోసిన ఊపిరి… నా చివరి శ్వాస వరకు తెలంగాణ ఉజ్వల భవిత కోసం తపిస్తూనే ఉంటుంది.మీ రేవంతన్న” అని లెటర్ విడుదల చేశారు.