ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా పార్టీలు రంగం సిద్ధం చేస్తున్నాయి.ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కసరత్తు మొదలుపెట్టారు.
రాష్ట్రంలో టీడీపీ – జనసేన పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సీట్ల పంపకాలపై ఇప్పటికే టీడీపీ, జనసేన ప్రాథమిక నిర్ణయానికి వచ్చాయని తెలుస్తోంది.
కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ యోచనలో ఉన్నారని సమాచారం.కాగా జనసేన గెలిచే స్థానాలపై దాదాపు మూడు నెలల పాటు జనసేనాని సర్వే చేయించారు.
ఈ మేరకు ఇప్పటికే మొదటి విడత అభ్యర్థుల ఎంపికకు సమీక్ష పూర్తి అయింది.తొలి విడతలో కృష్ణా, గుంటూరు, ఒంగోలు, రాయలసీమ స్థానాలుండగా రెండో విడతలో గోదావరి జిల్లాల అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
అలాగే ఈ నెల 28, 29, 30 వ తేదీల్లో కాకినాడలో గోదావరి జిల్లాల అభ్యర్థుల ఎంపికపై పవన్ సమీక్షి నిర్వహించనున్నారు.గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు పోటీ చేసే విధంగా జనసేనాని కసరత్తు చేస్తున్నారని సమాచారం.
అలాగే ఇటీవల టీడీపీ నేత లోకేశ్ చేసిన వ్యాఖ్యలతో పాటు సీట్ల పంపకాలు, సీఎం అభ్యర్థి వంటి అంశాలపై పవన్ క్లారిటీ ఇవ్వనున్నారు.







