ప్రేమ్నగర్ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు ఓ పాటలో ‘నాకింకా లోకంతో పని ఏముంది…డోంట్ కేర్’ అంటారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి కూడా అదే.
ఆయన ఎవ్వరినీ లెక్కచేయరు.తన పార్టీవారినే లెక్కచేయని వ్యక్తి ఇతర పార్టీలకు భయపడతారా? కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు.ఆయన ఎందుకు వచ్చారో అందరికీ తెలుసు.రైతు సమస్యల మీద కేసీఆర్ ప్రభుత్వాన్ని కడిగిపారేయడానికి వచ్చారు.విదేశాల నుంచి తిరిగివచ్చాక రాహుల్ రైతు సమస్యలను ప్రధాన ఎంజెండాగా తీసుకొని వివిధ రాష్ర్టాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.కేసీఆర్ అధికారం చేపట్టాక ఇప్పటివరకు వందలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
తలా ఒక లెక్క చెబుతున్నప్పటికీ సుమారు ఏడొందల మంది ఉంటారని ఓ అంచనా.ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ చలించలేదు.
చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించలేదు.వారిని ఓదార్చలేదు.
ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మరో ముఖ్యమంత్రి అయితే జిల్లాల్లో పర్యటించి రైతు కుటుంబాలను పరామర్శించేవాడే.కాని కేసీఆర్ పట్టించుకోలేదు.
రాహుల్ గాంధీతో పాదయాత్ర చేయించి రైతు సమస్యలపై విమర్శలు చేయిస్తే కాంగ్రెసుకు మేలు జరుగుతుందని ఆ పార్టీ నాయకులు భావించారు.అందుకే యువరాజును రప్పించారు.
కాని ఇలాంటి గాంధీలు అనేకమంది వచ్చారు…పోయారు అంటూ కేసీఆర్ చప్పరించేశారు.మరి రాహుల్ పర్యటనకు రైతులు ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి.







