జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి నుంచి తొందరగానే తేరుకున్నారు.నెమ్మదిగా ఉంటే రాజకీయాల్లో వెనకబడిపోతామని, కష్టమైనా నష్టమైనా ఎక్కువగా ప్రజల్లో ఉంటేనే పొలిటికల్ మైలేజ్ పెరుగుతుందని పవన్ ఒక అంచనాకి వచ్చాడు.
అందుకే ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు పవన్ సిద్ధం అయిపోయాడు.ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్న రాజధాని వ్యవహారంలోకి పవన్ రాజకీయ దూకుడు పెంచాడు.
అయితే ఈ విషయంలో పవన్ రాజకీయం గందరగోళానికి గురిచేస్తోంది.ఆయన సొంత పార్టీ పెట్టుకుని కూడా టీడీపీకి అనుకూలంగానే సాగుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
తాజాగా అమరావతి రాజధాని పర్యటనలో పవన్ చేసిన కామెంట్స్ టీడీపీకి సంతోషంగా ఉంటాయేమో కానీ పవన్ కి రాజకీయ పునాదిగా ఉన్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో మాత్రం ఆయనకు పెద్దగా మద్దతు లభించడంలేదన్నట్టుగా తెలుస్తోంది.
అమరావతి రాజధాని విష్యం చాలా సున్నితమైన సమస్య.
అందుకే ఏపీ సీఎం జగన్ ఈ విషయంలో ఇప్పటికీ నోరు విప్పలేదు.టీడీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీకి కొత్త రాజధాని అమరావతిని నిర్మించే అవకాశం దక్కింది.
అయితే రాజధాని నిర్మాణంలో టీడీపీ సీరియస్ గా వ్యవహరించలేకపోవడం, అక్కడ భూ పంపిణి, తదితర విషయాల్లో టీడీపీ అపఖ్యాతి మూటగట్టుకుంది.ఇప్పుడు రాజధాని మార్చుతారనే వార్తల నేపథ్యంలో పవన్ అమరావతిలో పర్యటించి చేసిన కొన్ని కామెంట్స్ ఆయన రాజకీయ పరిపక్వతను తెలియజేస్తోంది.
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని, రైతులకు న్యాయం చేయాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు.రాజధాని అక్కడే ఉండాలని ఆయన పట్టుపడుతున్నారు.
కానీ ఏపీ నైసర్గిక పరిస్థితులు గమనించినపుడు మూడు భిన్న ప్రాంతాలు ఉన్నాయి.రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాలలో మిగిలిన రెండు ప్రాంతాల ప్రజలు అభివృధ్ధికి ఆమడ దూరంలో ఉన్నామనే భావనలో ఉన్నారు.

విభజన హామీల ప్రకారం ఈ ప్రాంతాలకు న్యాయం జరగలేదు.ఇక రాయలసీమ తీసుకుంటే శ్రీభాగ్ ఒప్పందం ఉండదే ఉంది.మరి వారికి రాజధాని అయినా హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉంది.కానీ వీటి గురించి పవన్ ఎక్కడా ప్రస్తావించకుండా అమరావతి రాజధాని నిర్మిస్తే చాలు అన్నట్టుగా పవన్ వ్యవహారం ఉండడంతో ఆయన టీడీపీతో అంటకాగుతున్నారనే విమర్శలకు బలం చేకూరుతోంది.
ఇప్పటి వరకూ మంత్రులు సంగతి ఎలా ఉన్నా జగన్ మాత్రం రాజధాని అమరావతి విషయంలో తన స్పందన తెలియజేయడంలేదు.ఇక బొత్స వంటి వారు కూడా రాజధాని అమరావతిని మారుస్తామని ఎక్కడా చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు.
అక్కడ రాజధానిని ఆర్ధిక పరిస్థితులను బట్టి నిర్మించుకుని వెళ్తామని బొత్స అన్నారు.ఈ సందర్భంగా పవన్ కు ఏమైనా డౌట్లు ఉంటే సీఎం ను కలిసి క్లారిటీ తెచ్చుకోవచ్చు.2015లో రాజధాని అమరావతి ప్రాంతంలో పవన్ పర్యటించినప్పుడు ప్రభుత్వం నుంచి అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా అంటూ అప్పట్లో చంద్రబాబు ని పవన్ కలిశారు.కానీ ఇప్పుడు పవన్ అటువంటి ప్రయత్నాలు ఏవీ చేయకుండా కేవలం సాధారణ నాయకుడిలా విమర్శలకే పరిమితం అయిపోవడం ఆయనపై విమర్శలు పెరగడానికి కారణం అవుతోంది.







