ప్రస్తుతం వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ 2024 ఎన్నికల్లో వైసీపీ ని ఏవిధంగా అధికారంలోకి తీసుకురావాలన్న విషయం పైనే దృష్టి సారించారు.ప్రస్తుతం వైసీపీకి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా ఇబ్బందులు ఏర్పడతాయి అని జగన్ బలంగా నమ్ముతున్నారు.
ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల ప్రభావం ఉన్నా, టిడిపి జనసేన పార్టీలు కలిసి కనుక ఎన్నికల్లో పోటీ చేస్తే కొత్త ఇబ్బందులు ఏర్పడతాయని, వైసీపీ అధికారంలోకి తీసుకు రావడం అంత ఆషామాషీ వ్యవహారం కాదనే విషయాన్ని జగన్ గుర్తించారు.అందుకే ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితిని వివిధ సర్వేల ద్వారా తెలుసుకుంటూ ఏమేమి మార్పుచేర్పులు చేయాలి ఏ నియోజకవర్గం ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయం పైన దృష్టి సారించారు.
ఇప్పటికే 2019 ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అక్కడ నియోజకవర్గ ఇన్చార్జి లతో పాటు, కీలక నాయకులు అందరితోనూ నియోజకవర్గాల వారీగా ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.
ఈ సందర్భంగా గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టడంతో పాటు, ఇక నుంచి పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఎవరు వ్యవహరించినా, సహించేది లేదని వార్నింగ్ సైతం ఇచ్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.ఇదిలా ఉంటే జనసేన నుంచి గెలిచి జగన్ కు జై కొట్టిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనే చర్చ మొదలైంది.2024 లో ఆయనకు టికెట్ దక్కే అవకాశం అనుమానంగానే ఉంది.

దీనికి జగన్ దగ్గర చాలా లెక్కలే ఉన్నాయి.ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యే గా వ్యవహరిస్తున్నారు.పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి అధికారికంగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు.అయితే ఆయనకు టికెట్ వచ్చే అవకాశమే అనుమానంగా ఉంది.
దీనికి కారణాలు చాలానే ఉన్నాయి.జనసేన ఈ నియోజకవర్గంలో బాగా బలంగా ఉండడం, రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండడం, ఇవన్నీ లెక్కలు వేసుకుని ఈ నియోజకవర్గంలో వేరే కొత్త వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అనేది జగన్ అభిప్రాయమట.
అదీ కాకుండా, ఇప్పుడు వైసీపీలోనే మూడు గ్రూపులు ఉన్నాయి .ఒకటి రాపాక వర ప్రసాద్ గ్రూప్ కాగా, మరో గ్రూపు వైసిపి నియోజకవర్గ ఇన్చార్జి అమ్మాజీ, ఇంకో గ్రూపు 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన బొంతు రాజేశ్వరరావు వర్గం.ఈ మూడు గ్రూపులు కారణంగా వైసిపికి ఇక్కడ కొత్త తలనొప్పులు వచ్చాయి.ఈ మూడు గ్రూపులలో ఏ వర్గానికి టికెట్ ఇచ్చినా , మళ్లీ ఓటమి ఎదుర్కోవాలనే నిర్ణయానికి వచ్చిన జగన్ ఈ సారి ఈ మూడు గ్రూపులకు కాకుండా మరో బలమైన అభ్యర్థిని రాజోలు నుంచి పోటీకి దించాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు గా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.