ఏపీ వరకు చూసుకుంటే సంక్షేమ పథకాలతో జగన్ దూసుకుపోతున్నారు.దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
ప్రజల అవసరాలు తీర్చుతూ, అందరివాడు గా ముద్ర వేయించుకున్నారు.ఆర్థికంగా ఏపీ ఎంత లోటు బడ్జెట్ లో ఉన్నా, జగన్ ఏమాత్రం లెక్క చేయడం లేదు.
అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలను నిరాటంకంగా అమలు చేసి చూపిస్తున్నారు.అయితే రోజు రోజుకు ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది.
అప్పులతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది.కరోనా వైరస్ ప్రభావం తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారింది.
దీనికి తోడు వేల కోట్ల తో ప్రతి నెల సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత జగన్ పై ఉంది.ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు తో పాటు, అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున నిధులు అవసరం.
కేంద్రం నుంచి ఏపీకి నిధులు అందాల్సి ఉన్నా, వైసిపి ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అభిప్రాయబేధాలు, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం దీనిపై పక్షపాత ధోరణి అవలంబిస్తోంది.మొదట్లో జగన్ తో కేంద్ర బిజెపి పెద్దలు సఖ్యత గా ఉన్నట్టుగా కనిపించినా, ఏపీలో బీజేపీని బలోపేతం చేసే ఉద్దేశంతో జగన్ ను దూరం పెడుతూ వస్తున్నారు.
ఆ ప్రభావం కేంద్ర నిధులపైన పడుతోంది.
జగన్ ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోది, అమిత్ షా తో పాటు, మరి కొంత మంది కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చి వచ్చారు.
ఆదుకోవాలని, నిధులు మంజూరు చేయాలని కోరారు.అయినా కేంద్రం మాత్రం పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తోంది.దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.పోనీ జగన్ అవసరం కేంద్రానికి ఏమీ లేదా అంటే కేంద్రం ప్రవేశపెట్టిన కీలకమైన బిల్లులు పాస్ కావాలి అంటే, తప్పనిసరిగా వైసీపీ ఎంపీల మద్దతు కేంద్రానికి అవసరం.
ఇప్పటికే అనేక పార్టీలు కేంద్రం తో విభేదించి బీజేపీతో పొత్తు రద్దు చేసుకున్న నేపథ్యంలో, వైసీపీ ఎంపీల మద్దతు కేంద్రానికి అవసరమైంది.అవసరమైన ప్రతి సందర్భంలోనూ, ప్రతి బిల్లు కు అనుకూలంగానే వైసిపి ఎంపీలు మద్దతు తెలుపుతూ వస్తున్నారు.
అయినా, ఈ విషయంలో కేంద్రం వైఖరి నిర్లక్ష్యంగా ఉన్నట్టు గా కనిపిస్తోంది.
జగన్ కేవలం వినతి పత్రాలు, విజ్ఞాపనలు చేయడం వరకే సరిపెడుతున్నారు తప్ప , తమకు ఉన్న ఎంపీల బలం తో కేంద్రంపై గట్టిగా గొంతెత్తలేకపోవడం వంటి కారణాలతో ఏపీ విషయంలో కేంద్రం వైఖరి మారటం లేదు.
ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ విషయమే చూసుకున్నా, మొహమాటంగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు తప్ప, గొంతు పెంచకపోవడంతో ఏపీకి జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది.