ఏపీకి ప్రత్యేక హోదా ! ఈ పదం 2019 ఎన్నికలకు ముందు వరకు ఏపీలో బాగా ప్రచారం అయింది.ఏపీ, తెలంగాణ విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ, కాంగ్రెస్, బిజెపి, చేసిన ప్రకటనపై అప్పట్లో అధికార పార్టీగా ఉన్న టిడిపి కేంద్రంపై ఒత్తిడి పెంచింది.
ఇక అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది.ఢిల్లీకి వెళ్లి మరి జగన్ , ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, బిజెపిపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు.ఎన్నికల సమయంలోనూ ఏపీకి ప్రత్యేక హోదాపై వైసీపీ అధినేత జగన్ టిడిపి తీరును తప్పుపడుతూ బిజెపిపై విమర్శలు చేశారు.2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని అంత సీరియస్ గా అయితే తీసుకోలేదు.అప్పుడప్పుడు హోదా అంశాన్ని వైసిపి ఎంపీలు పార్లమెంటులోనూ, రాజ్యసభలోను ప్రస్తావిస్తూ వస్తున్నారు.ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లిన ప్రతి సందర్భంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర బిజెపి పెద్దలు వద్ద ప్రస్తావిస్తూ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో.ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పోరాడాలని వైసిపి నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.కొద్ది రోజులుగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యేక హోదా డిమాండ్ ను వినిపిస్తూ బిజెపి పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కాంగ్రెస్, బిజెపి లే అని విమర్శలు చేస్తున్నారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక శాతం ఓట్లతో, బిజెపి 0.5% ఓట్లతో తుడిచిపెట్టుకుపోయాయని విజయ్ సాయి రెడ్డి విమర్శలు చేశారు.

బిజెపి హోదా అనేది చరిత్ర అంటుందని, కానీ తాము ప్రత్యేక హోదా డిమాండ్ ను చరిత్రలో కలిసిపోనివ్వమని, సాధించి తీరుతామంటూ విజయసాయిరెడ్డి సవాల్ చేస్తున్నారు.అయితే వైసిపి ప్రతి సందర్భంలో కేంద్రానికి మద్దతు ఇస్తూనే వస్తోంది.కేంద్రం ఏ బిల్లును ప్రవేశపెట్టినా.అడిగిన ,అడగకపోయినా వైసిపి మద్దతు ఇస్తుంది.ఏపీలో ఎలా ఉన్న కేంద్ర స్థాయిలో బిజెపి విధానాలను ప్రశంసిస్తూ.ఆ పార్టీ అగ్ర నేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం రాబోయే ఎన్నికల్లో తమకు ఇబ్బందికరంగా మారుతుందని భావిస్తున్న వైసిపి ఈ విషయంలో బిజెపి పైన విమర్శలు చేస్తూ గట్టిగానే నిలదీస్తోంది.ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అంటూ గట్టి పట్టే పడుతోంది.