యజమాని నమ్మకానికి తూట్లు పొడిచి 3,31,858 పౌండ్ల విలువైన డబ్బు, ఆస్తులను అక్రమ మార్గాల ద్వారా కాజేసినందుకు గాను భారత సంతతికి చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్కు యూకే కోర్టు ఐదున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది.నిందితుడిని 73 ఏళ్ల సుఖ్వీందర్ సింగ్గా గుర్తించారు.
ఈశాన్య ఇంగ్లాండ్లోని యార్క్ క్రౌన్ కోర్టు … నాలుగు మోసాలు, మనీలాండరింగ్పై సుఖ్వీందర్కు శిక్ష విధించింది.ఇతని చేతిలో మోసపోయిన బాధితుడి వివరాలు తెలియజేయలేదు.
అయితే కోర్టు పత్రాలలో అతనిని ‘ఏ’గా గుర్తించారు.అతనికి సామాజిక, శారీరక వైకల్యాలు వున్నాయని అందుకే బాధితుడిని సింగ్ లక్ష్యంగా చేసుకుని మోసగించారని కోర్టుకు ప్రాసిక్యూషన్ తెలియజేసింది.
నమ్మకమైన స్నేహితుడిగా, వృత్తిపరమైన ఆర్ధిక సలహాదారుగా సుఖ్వీందర్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నాడు.వ్యక్తిగత ప్రయోజనాల కోసం డబ్బు, ఆస్తిని మళ్లించడంలో అతని చర్యలు నమ్మకాన్ని పొగొట్టుకున్నాయని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) సీరియస్ ఎకనామిక్ ఆర్గనైజ్డ్ సీనియర్ క్రౌన్ ప్రాసిక్యూటర్ ఆండ్రియా థామస్ అన్నారు.
నిందితుడు సుఖ్వీందర్ సింగ్ బాధితుడికి చెందిన మరిన్ని ఆస్తులను కాజేసివుండవచ్చని నార్త్ యార్క్షైర్ పోలీసులు భావిస్తున్నారు.సింగ్ అక్రమ సంపాదనను రీకవరి చేయడంపై చర్యలు ప్రారంభించారు అధికారులు.
నార్త్ యార్క్ షైర్ పోలీస్ ఫోర్స్ చేసిన దర్యాప్తులో ‘ఏ’ తల్లిదండ్రులు మరణించినప్పుడు.బాధితుడి ఆర్ధిక వ్యవహారాలను క్రమబద్ధీకరించడానికి సుఖ్వీందర్ సింగ్ ప్రతిపాదించినట్లు కనుగొన్నారు.
ఈ క్రమంలో బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి 34,000 పౌండ్లను తీసుకున్నాడు.అదే నెలలో హారోగేట్లోని ‘‘ఏ’’ ఇంటి యాజమాన్యాన్ని సింగ్ తన స్వంత కంపెనీలకు మళ్లించాడు.
దీని విలువ దాదాపు 2,75,000 పౌండ్లు వుంటుందని అంచనా.
ఇందుకోసం సుఖ్వీందర్ సింగ్ తన కంప్యూటర్లో అగ్రిమెంట్లు, లేఖలతో సహా అనేక నకిలీ పత్రాలను సృష్టించాడు.ఈ నేరాలకు సంబంధించి సుఖ్వీందర్ను అరెస్ట్ చేసే సమయంలో స్పెయిన్ అపార్ట్మెంట్, జెర్సీలోని బ్యాంక్ ఖాతాలో వున్న దాదాపు 5,000 పౌండ్లతో సహా ‘‘ఏ’’కి చెందిన మరిన్ని ఆస్తులను పొందేందుకు అతను యత్నించిన ఆధారాలను సీపీఎస్ స్వాధీనం చేసుకుంది.