సమాజంలో వివాహం అయ్యాక ఆడవాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు వస్తాయి.భర్త, అత్తమామలు మంచివారైతే పర్వాలేదు కానీ హింసించే వారైతే ఆ మహిళకు నరకమే.
కొందరు మూర్ఖులు భార్యలను కనీసం మనిషిగా కూడా చూడకుండా నానా చిత్రహంసలు పెడుతున్నారు.పాతికేళ్లు కనిపెంచిన తల్లిదండ్రులను వదిలి.
భర్తే తన సర్వస్వం అనుకున్న భార్య కు మెట్టేనింట్లో క్రమేణ వేధింపులు పెరగడంతో చివరికి భర్త చేతిలోనే సజీవ దహనం అయిన ఒక దారుణ సంఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్ లోని మేడ్చల్ లో నివాసం ఉండే తిరునగర్ నరేందర్ (35)కు, నవ్యశ్రీ (33)తో 15 సంవత్సరాల క్రితం వివాహం అయింది.
వీరికి శ్రీచందన (14), శ్రీమేఘన (12) అనే ఇద్దరు పిల్లలు సంతానం.ఫిబ్రవరి 8 శివరాత్రి రోజు భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో నరేందర్.నవ్యశ్రీ పై శానిటైజర్ పోసి నిప్పంటించాడు.చుట్టుపక్కల వారు చూసి మంటలు ఆర్పి నవ్యశ్రీని ఆసుపత్రిలో చేరి పోలీసులకు సమాచారం అందించారు.

తన భర్త జైలుకు వెళితే పిల్లలు అనాథలవుతారని భావించిన నవ్యశ్రీ పోలీసులకు శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నానని ఆరోజు నాలుగు గంటలకు దేవుడికి దీపం వెలిగించే క్రమంలో చీరకు నిప్పంటుకుందని ప్రమాదం జరిగిందని తెలిపింది.భయంతో బయటకొచ్చిన తనను భర్త, పక్కింటి వాళ్లు మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారని పేర్కొంది.పోలీసులు ప్రమాద ఘటనగా కేసు నమోదు చేశారు.

మార్చి 5న నవ్యశ్రీ ప్రాణాలు విడిచింది.విషాదం జీర్ణించుకోలేక పోయిన కుమార్తెలు మరుసటి రోజు పోలీసులకు తమ తండ్రి, తల్లి పై శానిటైజర్ పోసి నిప్పు పెట్టిన సంగతి బయటపెట్టారు.నరేందర్, నవ్య శ్రీ పై శానిటైజర్ పోసి నిప్పు పెట్టిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి.
పోలీసులు నరేందర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.







