గ్రూపు రాజకీయాలతో రాజకీయ పార్టీలు పడే అవాస్తఘాలు అన్ని ఇన్ని కావు.ఎవరికి వారు తామే గొప్ప నాయకులం అనిపించుకునేందుకు తహతహలాడిపోతూ ఇంకొకరి నాయకత్వంలో పనిచేసేందుకు ససేమీరా అనడం ఈ గ్రూపు రాజకీయాలకు ఊతం ఇస్తోంది.
ఇక అధికారంలో ఉన్న పార్టీలో ఇక చెప్పక్కర్లేదు.ఇప్పుడు తెలంగాణ అధికార పార్టీకి కూడా ఈ గ్రూపు రాజకీయాల తలనొప్పులు బాగా ఎక్కువయ్యాయి.
అసలే ముందస్తు ఎన్నికలకు వెళదామని హుషారు చూస్పిస్తున్న టీఆరఎస్ అధినేత కేసీఆర్ కు ఈ గ్రూపు రాజకీయాలు పెద్ద తలపోటుగా మారాయి.అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న నాయకుల మధ్య రోజురోజుకి దూరం పెరిగిపోయి పార్టీకి చేటు తెచ్చేలా పరిస్థితి మారింది.
ముఖ్యంగా టీఆర్ఎస్ పాత నేతలకు , ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నాయకులకు అస్సలు పడడం లేదు.మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకుంటూ వీధికెక్కి మరీ రచ్చ రచ్చ చేస్తున్నారు.దీంతో నియోజకవర్గ స్థాయిలో పాత కొత్త నేతల మధ్య సమన్వయం, నేతల మధ్య విభేదాలు పరిష్కరించే బాధ్యతను మంత్రులకు అప్పగించారు సీఎం కేసీఆర్.అయినా పరిస్థితి లో పెద్దగా మార్పు మాత్రం కనిపించడంలేడు.
ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు నేతలు నోటికి పని చెప్తున్నారు.
ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ శ్రేణుల్లో కలవటంలేదు.
రెండు వర్గాలు విడివిడిగానే ఎవరికి వాళ్ళు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అప్పుడప్పుడు సమావేశ వేదికల పైనే ఒకరిపై బాహాబాహీకి దిగుతున్నారు.
ఈమధ్యనే వరంగల్ జిల్లా పరకాల మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసం విషయంలో ఓటమికి గ్రూప్ తగాదాలే కారణమని పార్టీ అధిష్టానం గుర్తించింది.టిడిపిలో గెలిచి టిఆర్ఎస్ లో చేరిన చల్లా ధర్మారెడ్డి వర్గానికి టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు సహకరించకపోవడం నియోజక వర్గంలో పాత కొత్త నేతల మధ్య సమన్వయం లేకపోవడంతోనే పరకాల మున్సిపాలిటీ చేజారిపోయినట్లు టిఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.
నేతల మధ్య విభేదాలు పరిష్కరించే విషయంలో మంత్రులే సుప్రీంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.పాత కొత్త నేతల మధ్య సమన్వయం కోసం మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటుచేసి నేతలందరినీ ఒక్కటి చెయ్యాలని, వారి మధ్య విభేదాలు తొలగించాలని మంత్రులకు కేసీఆర్ సూచించారు.పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడవద్దని, వీటిని చూసీ చూడనట్టు వదిలేస్తే పార్టీ పుట్టి ముంచడం ఖాయం అని కేసీఆర్ మంత్రులకు హితబోధ చేస్తున్నాడు.