ప్రతి ఏడాది భారత్ నుండి ఇతర విదేశాలకు చాలామంది వెళ్లిపోతున్న వారి సంఖ్య పెరిగిపోవడం తెలిసిందే.ఈ పరిణామంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఇండియాలో చాలా పరిస్థితులు దయనీయంగా మారాయి.ఇలాంటి తరుణంలో పార్లమెంటులో 2011 నుంచి ఇప్పటివరకు దేశాన్ని విడిచిన వారి లెక్క కేంద్రం బయటపెట్టింది.

పూర్తి విషయాల్లోకి వెళ్తే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.2011 నుంచి ఇప్పటివరకు దాదాపు 16 లక్షల మంది ప్రజలు భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు స్పష్టం చేశారు.అత్యధికంగా 2022లో 2.25 లక్షల మంది ప్రజలు భారత పౌరసత్వాన్ని వదులుకోవటం జరిగిందని పేర్కొన్నారు.2020లో అత్యల్పంగా 85,256 మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారని రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.ఏడాది వారీగా భారత్ పౌరసత్వాన్ని వదులుకున్న సంఖ్య వివరించారు.

2011లో 1,22,819 మంది, 2012లో 1,20,923 మంది, 2013లో 1,31,405 మంది, 2014లో 1,29,328 మంది, 2015లో 1,31,489 మంది, 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049 మంది, 2018లో 1,34,561 మంది, 2019లో 1,44,017 మంది, 2020లో 85,256 మంది, 2021లో 1,63,370 మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. 2022 లో ఈ సంఖ్య 2,25,620కు పెరిగినట్లు చెప్పారు.ఇదే సమయంలో భారతీయుల పౌరసత్వం పొందిన 135 దేశాల జాబితాను కూడా వెల్లడించడం జరిగింది.అంతే కాదు గత మూడు ఏళ్లలో ఐదుగురు భారతీయులు యూఏఈ పౌరసత్వాన్ని పొందినట్లు జైశంకర్ స్పష్టం చేశారు.







