కాంగ్రెస్ కొత్త జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున ఖర్గే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న అన్ని రాష్ట్రాల పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు.ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిని పూర్తిగా మార్చి పార్టీ నేతలు అందరిని యాక్టివ్ చేసి, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు.
దీనిలో భాగంగానే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలు అందరితోనూ ఆయన ఢిల్లీలో భేటీ అవుతున్నారు.క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, గతంతో పోలిస్తే కాంగ్రెస్ రోజు రోజుకు ఎందుకు బలహీనం అవుతోంది ? నాయకుల గ్రూపు రాజకీయాల సంగతి ఏంటి ? ఇలా అనేక అంశాలపై ఆరా తీస్తున్నారట.
ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై తరచుగా వస్తున్న ఫిర్యాదుల పైన ఆయన దృష్టి సారించారు.ఈ మేరకు నేరుగా రేవంత్ తోనే ఆయా అంశాల ప్రశ్నించినట్లు సమాచారం.‘ మీరు కలుపుకొని వెళ్లడం లేదా.వారు కలిసి రావడం లేదా ? అసలు లోపం ఎక్కడ ఉంది ? సమన్వయం ఎందుకు దెబ్బతింటుందని, మీపై వస్తున్న ఫిర్యాదులు నిజమేనా అని రేవంత్ ను సుతిగానే ప్రశ్నించినట్టు సమాచారం.
![Telugu Aicc, Pcc, Revanth Reddy, Telangana-Political Telugu Aicc, Pcc, Revanth Reddy, Telangana-Political](https://telugustop.com/wp-content/uploads/2022/11/aicc-mallikarjuna-kharge-pcc-chief.jpg )
దీనికి రేవంత్ సమాధానం ఇస్తూ, పార్టీలోని కొంతమంది సీనియర్ల తీరు కారణంగా తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన మల్లికార్జున ఖర్గే కు చెప్పినట్లు సమాచారం.అయితే వీటన్నిటిని పరిష్కరిస్తామని, నియోజకవర్గస్థాయి నేతలకు అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, సాధ్యమైనంతవరకు వారందరికీ అందుబాటులో ఉండాలని రేవంత్ కు సూచించారు.ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం పైన సీరియస్ గానే ప్రశ్నించారట.పెద్ద ఎత్తున నేతలను అక్కడ మోహరించినా ఎందుకు అక్కడ ఫలితం దక్కలేదని, అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలతో మాట్లాడి వారిని కలుపుకు వెళ్లాలని సూచించారట.
పార్టీని వీడి ఇతర పార్టీ చేరేందుకు ప్రయత్నిస్తున్న నేతలను గుర్తించి వారిని బుజ్జగించి పార్టీలో యాక్టివ్ చేయాలని, సీనియర్లు జూనియర్ లు అనే భేదాలు ఎక్కడా బయటపడకుండా కలిసికట్టుగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చే విషయంపైనే దృష్టి సారించాలని కొత్త అధ్యక్షుడు సూచించారట.