అమెరికాలోని టెన్నెస్సీలోని తూర్పు మెంఫిస్లో( East Memphis, Tennessee, USA ) జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య ఉన్న తెలుగు విద్యార్ధి మోహన్ సాయి పోతుగుంటకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అండగా నిలిచారు.శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం గోవిందవరం పంచాయతీకి చెందిన మోహన్ గురువారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అపార్ట్మెంట్ భవనం వెలుపల తన స్నేహితుడి కారులో కూర్చొని ఉండగా దాడికి గురయ్యాడు.
మెంఫిస్లో పోలీస్ డిపార్ట్మెంట్ను ఉటంకిస్తూ వచ్చిన నివేదిక ప్రకారం .పార్క్ చేసిన కారులో ప్యాసింజర్ సీట్లో ఉన్నప్పుడు ఓ సాయుధుడు మోహన్ దగ్గరికి వచ్చి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో ఆయన భుజం, మోచేతి వద్ద తీవ్ర గాయాలయ్యాయి.
తీవ్రంగా గాయపడినప్పటికీ మోహన్ తన కారును నడుపుకుంటూ హైలాండ్లోని వాలెరో గ్యాస్ స్టేషన్ వద్దకు వెళ్లగలిగాడు.అనంతరం అక్కడ అత్యవసర సాయం కోసం 911కు ఫోన్ చేశాడు.

ఇంతలో స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం మోహన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.అతనికి అండగా నిలిచేందుకు, వైద్య ఖర్చుల నిమిత్తం GoFundMeలో నిధుల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.ఇప్పటి వరకు దాదాపు 15 వేల డాలర్లకు పైగా నిధులు సేకరించినట్లుగా తెలుస్తోంది.
ఈ సంఘటన గురించి తెలుసుకున్న బొజ్జల సుధీర్ రెడ్డి ( Bojjala Sudheer Reddy )మోహన్ కుటుంబ సభ్యులను సంప్రదించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.అలాగే మోహన్ చికిత్సకు ఆర్ధికంగా సాయం చేస్తానని తెలిపారు.
అమెరికాలో తనకున్న పరిచయాలు, సన్నిహితుల ద్వారా మోహన్ ఆరోగ్య పరిస్ధితిని బొజ్జల సుధీర్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

కాగా.ఇటీవల చికాగోలో జరిగిన కాల్పుల్లో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.మృతుడిని విస్కాన్సిన్ – మిల్వాకీ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న జీ.ప్రవీణ్గా గుర్తించారు.ఇతను అక్కడ చదువుకుంటూనే ఓ స్టోర్లో పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.
బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.ప్రవీణ్ మరణవార్తను అమెరికా అధికారులు అతని కుటుంబానికి తెలియజేశారు.







