నల్లగొండ జిల్లా:ఈ ఏడాది జనవరి 31వ,తేదీన సర్పంచుల పదవీకాలం ముగిసి,ఫిబ్రవరిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక అధికారుల పాలన మొదలై,గ్రామ పంచాయితీలకు వివిధ శాఖలకు చెందిన వారిని స్పెషల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం నియమించింది.నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులు పత్తా లేకుండా పోయారు.
నిధుల,విధులపై స్పష్టత లేకపోవడంతో వారు అసలైన విధుల్లోనే నిమగ్నమయ్యారు.నిర్వహణ వ్యవహారాలు మొత్తం ప్రత్యేక అధికారుల చేతుల్లో ఉండడంతో గ్రామాలకు ఒరిగిందేమీ లేకపోగా గ్రామపంచాయితీ ఖాతాలు ఖాళీగా పడి ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
గ్రామ కార్యదర్శులే అన్ని పనులు చూసుకుంటున్నా,వారి చేతిలో అధికారం లేక, నిధులు అందక,విధుల నిర్వహణ భారమవుతుందని పలువురు కార్యదర్శులు వాపోతున్నారు.ఆర్థికపరమైన సమస్యలు వచ్చినప్పుడు స్పెషల్ ఆఫీసర్లు చేతులెత్తేయడంతో అప్పులు చేసి మరి కనీస అవసరాలు తీర్చేందుకు నానా తంటాలు పడుతున్నామని,గ్రామ సిబ్బందికి నెలలకొద్దీ జీతాలు రాకపోవడంతో సొంతంగా డబ్బులు ఇచ్చి ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు తీసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.15 వ ఆర్థిక సంఘం స్టేట్ ఫైనాన్స్ ఇచ్చే నిధులు,పన్నుల వసూళ్లు పంచాయితీలకు ముఖ్యమైన ఆర్థిక వనరులు.చాలాకాలంగా ఎస్ఎఫ్సి (స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్) నిధులు రావడం లేదు.
కేంద్ర ప్రభుత్వం నేరుగా జనాభాకు అనుగుణంగా పంచాయతీకి ఇచ్చే నిధులు ప్రత్యేక పాలన ప్రారంభమైనప్పటి నుండి రావడం లేదు.పన్ను వసూళ్లు అంతంత మాత్రం అవుతున్నా ఖర్చులు పెరగడంతో సిబ్బంది జీతాలు,ట్రాక్టర్ డీజిల్, మెయింటినెన్స్ తప్ప మిగులు ఏమి ఉండడం లేదు.
ఇక మాకేం సంబంధం లేనట్లుగా స్పెషల్ ఆఫీసర్లు కనీసం పంచాయితీల వైపు కన్నెత్తి చూడకపోవడంతో కార్యదర్శులపై ఆర్థికపరమైన పనిభారం పడుతుంది.ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేస్తే కార్యదర్శులపై ఒత్తిడి తగ్గి ఉత్సాహంగా పనులు చేపిస్తామని వారు అంటున్నారు.
గత 20 రోజుల నుండి గ్రామపంచాయతీల్లో చెత్త సేకరించే ట్రాక్టర్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం.గ్రామపంచాయతీ సిబ్బందిని అడగగా డీజిల్ లేదని సమాధానం చెబుతున్నారు.మండల అధికారులను అడగగా మాకేం సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు.మా సొంత డబ్బులతో ఆటోలను కిరాయికి మాట్లాడుకుని చెత్తను పారేసుకునే పరిస్థితి ఉందని ముత్యాల సురేష్అంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పంచాయితీ పాలనపై దృష్టి సారించి, గ్రామాల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు







