నల్లగొండ జిల్లా: మాడుగులపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇసుక అక్రమ దందా మూడు పూటలు ఆరు ట్రాక్టర్లుగా యధేచ్చగా సాగుతున్నా అడ్డుకునే వారులేకపోవడం గమనార్హం.అధికారుల నిర్లక్ష్యం, చేతివాటంతోనే మాడుగులపల్లి మండల పరిధిలోని కల్వేలపాలెం, చిరుమర్తి, ఆగామోత్కూర్,బొమ్మకల్లు గ్రామాల నుండి ఇష్టారాజ్యంగా ఇసుక రవాణా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కాంట్రాక్టర్లు, ఇసుక వ్యాపారుల అక్రమ దందాలతో కాలువలు, చెరువులు,కుంటలు కరిగిపోతుండటం స్థానిక ప్రజలను ఆందోళన గురిచేస్తుంది.
భవనాలు తదితర అభివృద్ధి నిర్మాణ పనులు పేరు చెబుతూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేపడుతూ అక్రమార్కులు లక్షలు గడిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని,అక్రమరవాణా గురించి అధికారులకు సమాచారం ఇచ్చినా,డయల్ 100 కు కాల్ చేసినా కుంటి సాకులు చెబుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ ఇసుక దందాను అరికట్టాల్సిన సంబంధిత శాఖల అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్దం కావడం లేదని,
గ్రామాల్లో ప్రకృతి విధ్వంసం సృష్టిస్తున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.ఇసుక వ్యాపారులు అడ్డూ అదుపూ లేకుండా ఇసుకను అక్రమ రవాణా చేస్తూ,కాసులు గుమ్మరించుకుంటూ ప్రకృతి సంపదన కొల్లగొడుతున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి.
అడపా దడపా రావడం చుట్టపు చూపుగా వెళ్లిపోవడం జరుగుతుందని,ఇప్పటికైనా అధికార యంత్రాంగం వీటిపై దృష్టి సారించి అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలని పలువురు రైతులు,గ్రామస్తులు కోరుతున్నారు.