యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.జిల్లాలోని పలు మున్సిపల్ చైర్మన్లపై వరుస అవిశ్వాస తీర్మానాలు తెరపైకొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రిపై అవిశ్వాసం ప్రవేశ పెట్టాలని 12 మంది కౌన్సిలర్లలో 9 మంది సంతకాలతో కూడిన నోటీస్ ను జిల్లా కలెక్టర్ హన్మంత్ కె.జెండగే కు అందజేయడంతో మోత్కూరు మున్సిపల్ రాజకీయం వేడెక్కింది.అవిశ్వాస నోటీసు ఇచ్చిన వారిలో 5గురు బీఆర్ఎస్, నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉండడం గమనార్హం.
చైర్మన్ పదవికి మరో ఏడాది గడువు ఉంది.
అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీ కౌన్సిలర్లు చైర్మన్ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ కౌన్సిల్ సమావేశాన్ని సైతం బహిష్కరించి అవిశ్వాసానికి సిద్ధమయ్యారు.కానీ, అప్పటి తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ కుమార్ ఆదేశాలతో ఆ ప్రక్రియకు తెరపడింది.
తాజాగా మరోసారి అవిశ్వాస తీర్మానం కాపీని కౌన్సిలర్లు కలెక్టర్కి అందజేయడంతో మోత్కుర్ మున్సిపల్ పీఠం ఎవరికీ దక్కునుందనే ఆసక్తి నెలకొంది.